ప్రకృతి ఒడిలో ప్రయాణం.. 28 నుంచి శ్రీశైలానికి లాంచీ యాత్ర..

345
- Advertisement -

పర్యాటకులకు, ప్రకృతిని ఆరాధించే వారికి టూరిజం శాఖ తీపి కబురు అందించింది. నాగార్జునసాగర్ రిజర్వా యర్‌లో నీటి మట్టం 575 అడుగులకు పైన ఉన్నందున నందికొండ నుంచి శ్రీశైలంకు లాంచీ ప్రయాణం కొనసాగించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లును పూర్తి చేసింది. ఈ నెల 28వ తేదీన హిల్‌ కాలనీ లాంచీ స్టేషన్ నుంచి శ్రీశైలంకు లాంచీ ప్రయాణాలు ప్రారంభిస్తున్నట్లు అధికారుల తెలిపారు. రెండు రోజుల పాటు సాగే ఈ ప్రయాణంలో జలపాతాల అందాలు, జింకలు, దుప్పుల పరుగులు, నదికి ఇరువైపులా నల్లమల అందాల నడుమ అలలపై లాంచీ ప్రయాణం పర్యాటకులకు మధురానుభూతులు పంచనుంది.

ప్రతి శనివారం లాంచీ ప్రయాణం..

ప్రతి వారంతపు శనివారం ఉదయం ప్రారంభమయ్యే ఈ లాంచీ ప్రయాణం ఆదివారం సాయంత్రం తిరిగి నాగార్జునసాగర్‌కు చేరుకుంటుంది. ఈ రెండు రోజుల ప్రయాణంలో పర్యాటకులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా టూరిజం శాఖ లైఫ్ జాకెట్లు, మంచినీటి వసతి, ఆహార ఏర్పాట్లతో పాటు అన్ని రకాల జాగ్రత్తలను తీసుకుంటుంది. అదేవిధంగా పర్యాటకులకు మల్లన్న దర్శనాన్ని, బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తుంది.

లాంచీ ప్రయాణంలో కనువిందు చేసే దృశ్యాలు..

నందికొండ నుంచి శ్రీశైలంకు కొనసాగే ఈ రెండు రోజుల ప్రయాణం తీరం వెంబడి వున్న అమ్రాబాద్ నల్లమల్ల అడువుల ప్రకృతి సహజ అందాలు పర్యాటకుల మనస్సులను ఇట్టే కట్టి పడేస్తాయి. కృష్ణమ్మ సవ్వడుల మధ్య సాగే ఈ ప్రయా ణంలో చాకలిగట్టు సమీపించగానే జింకలు, దుప్పులు కనువిందు చేస్తాయి. గౌతమ బుద్దుడి చారిత్రాత్మక విశేషాలను, జీవిత గాథలను తెలిపే నాగార్జునకొండ సమీపంగా సాగుతూ కొద్ది ప్రయాణంలోనే పురాతన ఏలేశ్వర గట్టు దర్శనమి స్తుంది. ఈ ప్రయాణంలో చారిత్రక కోటలు, కొండలు, జలపాతాలు, మొసళ్లు, అందమైన పర్వతాలు ముందుకు వెళ్లే కొద్దీ చూడ ముచ్చటైన అందాలు కనివిందు చేస్తూనే ఉంటాయి. సాయంత్రానికి లింగాల గట్టు చేరుకుంటుంది. ఆ తర్వాత పర్యాటకులు శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొని ఆదివారం సాయంత్రానికి లాంచీలో నందికొండ చేరుకుంటారు.

లాంచీ ప్రయాణ వివరాలు..

టూరిజం శాఖ వారు శ్రీశైలం లాంచీ ప్రయాణాన్ని ఈ నెల 21వ తేదీన ఖరారు చేసినప్పటికీ సరిపడా ప్రయాణికులు లేక పోవడంతో ట్రిప్పును రద్దు చేశారు. తిరిగి మరలా వారంతపు శనివారం 28వ తేదీన శ్రీశైలం లాంచీ ట్రిప్పును ప్రారంభిస్తున్నట్లు వారు తెలిపారు. లాంచీ ప్రయాణానికి సంబంధించిన వివరాలు, టికెట్ ధరలను అన్‌లైన్‌లో పొందవచ్చునని తెలిపారు. పర్యాటకుల కోసం హిల్‌కాలనీ లాంచీ స్టేషన్ ఫొన్ నం 7997951023 అందుబాటులో ఉంచారు.

- Advertisement -