మహేష్ త్యాగం మరువలేనిది.. మంత్రి వేముల కన్నీరు..

483
Vemula Prashanth Reddy
- Advertisement -

జమ్మూకాశ్మీర్ మచిల్ కుపువారలో ఉగ్రదాడిలో వీరమరణం పొందిన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్పల్లి గ్రామానికి చెందిన ర్యాడా మహేష్‌కు మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి ఘన నివాళి అర్పించారు. సోమవారం మహేష్ కుటుంబ సభ్యులను మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి పరామర్శించడం జరిగింది. దేశ రక్షణలో ప్రాణాలను కోల్పోయిన జవాన్ మహేష్ అంతక్రియలు గౌరవంగా అధికార లాంఛనాలతో జరిగేలా జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుందని మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన మహేష్‌కు చిన్నతనం నుంచే అమితమైన దేశభక్తి.. దేశం మీద ప్రేమతో సైన్యంలో చేరి భారతావని కోసం నీవు చేసిన త్యాగం మరువలేనిదన్నారు. భౌతికంగా మా నుండి దూరమైన బాధ ఉన్నా…దేశం కోసం ప్రాణాలర్పించడం స్ఫూర్తి దాయకం అని మంత్రి ఉద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. వీర సైనికుడా యావత్తు తెలంగాణ నీకు నివాళి అర్పిస్తుంది. మహేష్ త్యాగం వెలకట్టలేనిదైనా…రాష్ట్ర ప్రభుత్వం తరుపున మహేష్ కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్, వేల్పూర్ వాసిగా నేను అండగా ఉంటామని మంత్రి తెలిపారు.

మంగ‌ళ‌వారం సాయంత్రం 4 గంట‌ల‌కు మ‌హేశ్ భౌతిక‌కాయం హైద‌రాబాద్‌కు వ‌స్తుంద‌ని మంత్రి తెలిపారు. మహేష్‌తో పాటు వీరమరణం పొందిన సైనికులకు నా జోహార్లు.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. వారికి ఆ భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్న. వీర జవాన్ల పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్న అని మంత్రి ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు.

- Advertisement -