సికింద్ర‌బాద్ రైల్వే స్టేష‌న్ కు కొత్త అందాలుఃమంత్రి త‌ల‌సాని

184
talasani srinivas yadav
- Advertisement -

వందల సంవత్సరాల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు త్వరలోనే కొత్త అందాలను సంతరించుకోనున్నాయని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. గురువారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు 30 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పుట్ పాత్ లు, బస్ షెల్టర్లు, రోడ్లు తదితర అభివృద్ధి పనులను మంత్రి ఆయా శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. వివిధ ప్రాంతాల నుండి ప్రతినిత్యం లక్షలాది మంది ఇక్కడి నుండి రాకపోకలు కొనసాగిస్తుంటారని, వారిని దృష్టిలో ఉంచుకొని వారు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సంకల్పంతో ఉన్నారని వివరించారు. ఇక్కడ థీం పార్క్ లను ఏర్పాటు చేయాలని మున్సిపల్ మంత్రి అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

ఒక సంవత్సరం లోగా GHMC, ట్రాఫిక్, వాటర్ వర్క్స్ ఇతర శాఖల సమన్వయంతో ఆధునిక బస్ షెల్టర్ల నిర్మాణం, పుట్ పాత్ లు, టాయిలెట్స్, రహదారులను ఎంతో అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి అయిన తర్వాత హైదరాబాద్ నగరంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. దేశం మొత్తం కరోనా నియంత్రణ చర్యలలో ఉంటే ghmc లో మాత్రం ఒకవైపు కరోనా నియంత్రణ చర్యలు తీసుకుంటూనే, మరో వైపు అభివృద్ధి పనులపై దృష్టి సారించిందని చెప్పారు. లాక్ డౌన్ సమయంలోనే నగరంలో రోడ్లు, ఫ్లై ఓవర్ లు, అండర్ పాస్ లు తదితర అనేక అభివృద్ధి పనులను చేపట్టినట్లు తెలిపారు. లాక్ డౌన్ తర్వాత ఇండ్ల నుండి బయటకు వచ్చిన ప్రజలు వీటిని చూసి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

- Advertisement -