కొత్త మున్సిపాలిటీలపై కేటీఆర్ సమీక్ష..

257
Ktr
- Advertisement -

ప్రస్తుతం కొత్త మునిసిపాలిటీలో ఉన్న ఎల్ అర్ ఎస్ అవకాశాన్ని వినియోగించుకునేల ప్రత్యేక ఎల్ఆర్ఎస్ మేళాలను పురపాలక శాఖ నిర్వహించనున్నట్లు మంత్రి కె.తారక రామారావు తెలిపారు. అయితే ఈ అవకాశం కేవలం నూతన మునిసిపాలిటీలు, మునిసిపాలిటీలో విలీనమైన గ్రామాలకు మాత్రమే అని గతంలోనే మార్గదర్శకాలు జారీ చేశామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలన్నారు. కొత్త మునిసిపాలిటీల్లో ఎల్ అర్ ఎస్ అవకాశం పైన విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని పురపాలక శాఖ అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఎల్ అర్ ఎస్ గడువు సెప్టెంబర్ వరకు ఉన్నదని మంత్రి తెలిపారు. ఈ అవకాశం నూతనంగా ఏర్పడిన 43 నూతన మున్సిపాలిటీలకు అవకాశం కలుగుతుందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఐదు సంవత్సరాలలో మెజార్టీ జనాభా పట్టణాల్లో ఉండే అవకాశం ఉందన్న మంత్రి పట్టణాల సమగ్రాభివృద్ది పైన దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరం అన్నారు. ఇప్పటికే భారీ ఎత్తున జనాభా పట్టణాలలో కేంద్రీకృతమైన నేపథ్యంలో వాటిని ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. పౌర సేవలే కేంద్రంగా నూతన పురపాలక చట్టాన్ని తెలంగాణ తీసుకువచ్చిందని, ఈ చట్టంలోని విధులు అధికారాలు ఖచ్చితంగా పాటించేలా అధికారులు పని చేయాలన్నారు.

ఈ రోజు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో మహబూబ్‌నగర్, గద్వాల, నారాయణపేట జిల్లా పరిధిలోని మునిసిపాలిటీల పైన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మరియు స్థానిక ఎమ్మెల్యేలు హజరయ్యారు. ఈసందర్భంగా కొత్త జిల్లాలుగా మారిన నారాయణపేట గద్వాల్ జిల్లా కేంద్రాల్లో స్పష్టమైన మార్పు కనిపించెలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి కేటీఆర్ సూచించారు. మూడు జిల్లాల పరిధిలోని అన్ని మున్సిపాలిటీల్లో రోడ్లు, గ్రీనరీ, స్మశానాల వంటి ప్రాథమిక అంశాలపైన శ్రద్ధ వహించాలని అధికారులకు సూచన చేశారు. దీంతోపాటు ప్రస్తుత వర్షాకాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు రాకుండా అరికట్టేందుకు పారిశుద్ధ్యంకు ప్రాధాన్యత ఇవ్వాలని కమిషనర్లకు, చైర్మన్లకు ఆదేశాలిచ్చారు. టాయ్ లెట్లు, పుట్ పాత్‌ల నిర్మాణాలు వేగంగా చేపట్టాలని సూచించారు.

జిల్లాలోని మున్సిపాలీటీలపైన అభివృద్దికి మంత్రి సూచించిన చర్యలు తీసుకుంటామని మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌లు తెలిపారు. ప్రత్యేకంగా సుదీర్ఘ సమీక్షా సమావేశంపెట్టి పురపాలికల ప్రాద్యాన్యతలపైన సవివరంగా మార్గదర్శనం చేసిన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు దన్యవాదాలు తెలిపారు. ఇలా సూక్ష్మస్ధాయిలో పట్టణాల్లో ఉన్న పరిస్ధితులపై క్షేత్రస్ధాయి చర్చించడం ద్వారా అయా పట్టణాల అభివృద్దికి దోహాదం చేస్తుందన్నారు. ఇప్పటికే తమ పరిధిలోని పురపాలికల్లో పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపిన మంత్రులు, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, పురపాలక శాఖా ఉన్నతాధికారులు, మున్సిపాలిటీల చైర్ పర్సన్ లు హాజరయ్యారు.

- Advertisement -