హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ది- తలసాని

197
talsani
- Advertisement -

మంగళవారం రాష్ట్ర‌ పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్‌లోని ఆదర్శనగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్‌, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ ల ఆధ్వరంలో వేలాది కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమను జీహెచ్ఎంసీ ఎన్నికలలో గెలిపిస్తాయని మంత్రి అన్నారు.

దేశం మొత్తం గర్వపడే విధంగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. హైదరాబాదు నగరంలో పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణం చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. అంతేకాకుండా పుట్‌పాత్‌ల అభివృద్ధి, పార్కుల అభివృద్ధి, ఓపెన్ జిమ్‌ల ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాలను చేపట్టినట్లు చెప్పారు. ఇవే కాకుండా వృద్దులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు పెన్షన్ లు అందజేస్తున్నట్లు తెలిపారు. పేద వర్గాల విద్యార్ధులు సైతం ఉన్నత చదువులను అభ్యసించేందుకు ప్రభుత్వం రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభించమని మంత్రి తెలిపారు.

నగరంలో నివసించే పేద ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే సంకల్పంతో బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం ఎంతో పటిష్టంగా పని చేస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ కార్పోరేషన్ ఎన్నికలలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రజల వద్దకు వెళతామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.

- Advertisement -