రైతుబంధుతో రైతుకు భరోసా- మంత్రి శ్రీనివాస్ గౌడ్

148
- Advertisement -

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతుబంధు, రైతు బీమా ,ఉచిత విద్యుత్ ఇస్తున్నదని రాష్ట్ర ఎక్సైజ్,క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన రైతు బంధు సంబరాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు బంధు కింద రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల కోట్ల రూపాయలు ఇచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని రైతుబంధు సంబరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు, ఈ కార్యక్రమంలో రైతులు, అధికారులు ,వ్యవసాయ శాఖ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని తెలిపారు.

గతంలో వరి ఉత్పత్తిలో ఉమ్మడి రాష్ట్రం 25 వ స్థానంలో ఉండేదని, ఇప్పుడు ప్రథమ స్థానంలో ఉందని అన్నారు. ఏ మార్కెట్లో చూసిన, గోదాములో చూసిన వరి ధాన్యం రాశులు, రాశులుగా ఉంటున్నదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులలో గౌరవం, విశ్వాసం ,భరోసా పెరిగిందని, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అనతికాలంలోనే ఎంతో ప్రగతి సాధించిందని, ప్రత్యేకించి రైతుల కోసం ప్రతి మండలానికి ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని ఏర్పాటు చేశామని తెలిపారు.

మహబూబ్ నగర్ జిల్లాలో ప్రస్తుతం రైతుబంధు కింద 2 లక్షల 9607 మంది రైతులకు 228 కోట్ల 20 లక్షల రూపాయలు ఇచ్చినట్లు వెల్లడించారు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 100 కోట్ల రూపాయలు ఇవ్వలేదని, అలాంటిది రైతుబంధు కింద రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల కోట్లు ఇవ్వడం జరిగిందని తెలిపారు.మహబూబ్ నగర్ జిల్లాలో యాసంగిలో 150 కోట్ల రూపాయలు ఇచ్చామని,జిల్లాలో రైతు బంధు కింద ఇప్పటివరకు1690 కోట్లు ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు.ఉమ్మడి మహబూబునగర్ జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం 500 కోట్ల రూపాయలు ఇచ్చామని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి కి జాతీయ హోదా కల్పించాలని, రైతుబంధు సంబరాలను విజయవంతం చేయాలని,తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014 కు ముందు ,2014 తర్వాత రైతుల కోసం చేపట్టిన కార్యక్రమాలపై గ్రామాల వారిగా తెలియజేయాలని, ప్రతి గ్రామంలో ఒక బోర్డును ఏర్పాటు చేసి అందరికీ తెలిసే విధంగా అవగాహన కల్పించాలని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు, దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి, గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -