అంగన్ వాడీల సేవలు బ్రహ్మాండం- మంత్రి సత్యవతి

499
satyavathi rathod
- Advertisement -

కరోనా మహమ్మారి బారీ నుంచి ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ సమయంలో పేదలు ఇబ్బంది పడొద్దనే ముఖ్యమంత్రి కేసిఆర్ ఆలోచన మేరకు అంగన్ వాడీ కేంద్రాలలో నమోదైన బాలింతలు, గర్భిణీలు, పిల్లలకు పాలు, గుడ్లు, బాలామృతం, నిత్యావసరాలు ఇంటి వద్దకే పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. అంగన్ వాడీ కేంద్రాల ద్వారా సరుకులు ఏ విధంగా పంపిణీ చేస్తున్నారని ఈ రోజు హైదరాబాద్, మాసబ్ ట్యాంక్ వద్ద ఎంజీ నగర్ అంగన్ వాడి కేంద్రాన్ని మంత్రి సత్యవతి రాథోడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ నమోదైన బాలింతలు, గర్భిణీ స్త్రీలు, పిల్లలకు సరుకులు, శానిటైజర్లు, మాస్క్ లు కూడా పంపిణీ చేశారు.

ప్రస్తుతం కరోనా కష్టకాలం నడుస్తోందని, ఈ సమయంలోనే మన అవసరం ప్రజలకు ఎక్కువగా ఉందని, వారికి ప్రభుత్వ సేవలన్నీ సకాలంలో అందించి ఆదుకోవాలన్నారు. అంగన్ వాడీ కేంద్రాల ద్వారా ఇచ్చే పాలు, గుడ్లు, నూనె, పప్పు, బియ్యం, బాలామృతం, నిత్యావసరాలకు ఎలాంటి కొరత లేకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వం పర్యవేక్షణ చేస్తూ, అందుబాటులో ఉండేటట్లు చర్యలు తీసుకుంటుందన్నారు. అదే విధంగా ఈ సమయంలో కూడా తమ సేవలను నిరాటంకంగా అందిస్తున్న అంగన్ వాడీల స్వీయ రక్షణ కోసం శానిటైజర్లు, మాస్క్ లు కూడా ఇప్పటికే అందించామన్నారు.

minister satyavathi rathod

ముఖ్యమంత్రి కేసిఆర్ ఆలోచన, ఆదేశాల మేరకు అంగన్ వాడీలు బాగా పనిచేస్తున్నారని, వీరి సేవలు బ్రహ్మండంగా ఉన్నాయని, నీతి ఆయోగ్ కూడా మన అంగన్ వాడీలను ప్రశంసించిందని గుర్తు చేశారు. లాక్ డౌన్ అయిన వెంటనే అంగన్ వాడీల ద్వారా మొదటి దశలో 12 రోజులకు సరిపడా అంగన్ వాడీ సరుకులు అందించామని, నేడు రెండో విడత అంగన్ వాడీ సరుకులు అందిస్తున్నామన్నారు.

లాక్ డౌన్ వల్ల ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడు కూడా ఒక్క పూట కూడా పస్తు ఉండొద్దన్న సిఎం ఆలోచన మేరకు అంగన్ వాడీ కేంద్రాల్లో నమోదైన బాలింతలు, గర్భిణీలు, పిల్లలకు పాలు, గుడ్లు, బాలామృతం, నిత్యావసర సరుకులు అందిస్తున్నామన్నారు. ఈ విషయంలో అంగన్ వాడీల పనితీరు బాగుందన్నారు.

minister satyavathi

ముఖ్యమంత్రి కేసిఆర్‌కి అంగన్ వాడీలంటే ఇష్టమని, అందుకే కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకున్నా వారి ఇబ్బందులను గుర్తించి, ఇంటికి పిలిచి వేతనాలు దేశంలో ఎక్కడా లేనివిధంగా పెంచారన్నారు. అంగన్ వాడీలు కూడా ముఖ్యమంత్రి కేసిఆర్ నమ్మకాన్ని నిలబెట్టేలా పనిచేయాలని కోరారు.

కరోనా వ్యాధికి మందులేదని, సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రతే దీనికి పరమౌషదమని దీనిని అంగన్ వాడీలు పాటిస్తూ మిగిలిన వారంతా కూడా పాటించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా -శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి శ్రీమతి దివ్య , జిల్లా సంక్షేమ అధికారి ఝాన్సీ, సిడిపిఓ రేణుక, స్థానిక కార్పోరేటర్ పాల్గొన్నారు.

- Advertisement -