బాల సదన్‌ను సందర్శించిన మంత్రి సత్యవతి రాథోడ్..

225
Minister Satyavathi
- Advertisement -

రాష్ట్రంలో అనాథల జీవన ప్రమాణాలు మెరుగుపరచి, వారి జీవితాలలో వెలుగు నింపి, వారి భవిష్యత్తుకు భద్రత కల్పించే గొప్ప లక్ష్యంతో సీఎం కేసిఆర్ రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ నియమించారు. ఈ నేపథ్యంలో మంగళవారం వరంగల్ జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లు.. రాష్ట్ర జల వనరుల శాఖ చైర్మన్ వి.ప్రకాష్, జిల్లా కలెక్టర్ రాజివ్ గాంధీ హనుమంతు, మేయర్ గుండు సుధారాణిలతో కలిసి సుబెదారిలోని బాల సదన్‌ను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించి, పిల్లల బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా బాల సదన్‌లో ఉన్న 52 మంది పిల్లలతో కలిసి మంత్రులు, కలెక్టర్, మేయర్ అల్పాహారం చేసి వారితో ముచ్చటించారు. ఇక్కడ ఆహారం ఎలా పెడుతున్నారు, ఇంకా ఏమి కావాలి అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో మాట్లాడి వసతులు, ఏర్పాట్ల గురించి సమీక్షించారు. సీఎం కేసిఆర్ ఆలోచన మేరకు ఇంకా ఎలాంటి చర్యలు చేపడితే అనాథ పిల్లల జీవితాలు బాగు పడుతాయి అని అడిగారు. దీనికి సంబంధించి వెంటనే నివేదిక ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే ఈ రాష్ట్రంలోని అనాథలకు తల్లిదండ్రిగా వారి సంపూర్ణ సంరక్షణ బాధ్యతలు తీసుకొనీ, వారి భవిష్యత్తుకు భద్రత కల్పించాలని, ఆడపిల్లలకు పెళ్లి కూడా చేయాలని ఇటీవలి కేబినెట్ సమావేశంలో సీఎం కేసిఆర్ నిర్ణయించినట్లు మంత్రులు వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. సీఎం కేసిఆర్ దృష్టికి అనాథ పిల్లల గురించి కొన్ని సంఘటనలు వచ్చాయన్నారు.వారిని ఆర్దికంగా బలోపేతం చేయాలి, వారి పెళ్ళిళ్ళు చేయాలనీ సీఎం కేసిఆర్ ఆలోచని తెలిపారు. రోడ్ల మీద ఏ పిల్లలు పనులు చేయకుండా వారిని ఆశ్రమాల్లో పెట్టీ సంరక్షణ చేయాలి అన్నారు. బాల సదన్ లో నేడు పిల్లలతో, అధికారులతో మాట్లాడి, వారి అవసరాలు తెలుసుకున్నాన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరి సలహాలు తీసుకుని ఈ కమిటీ నివేదిక ఇస్తుందని ఆయన అన్నారు.

మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. మొన్న కేబినెట్ సమావేశంలో కరోనా వల్ల అనాథలు అయిన పిల్లలని ఆదుకోవాలని సీఎం కేసిఆర్ చెప్పారు. రాష్ట్రంలో ఉండే అనాథలకు ఏం చేస్తే ఇంకా వారి జీవన ప్రమాణాలు మెరుగు చేయగలమో చెప్పాలన్నారు. దేశంలోనే ఆదర్శ సీఎంగా ఉన్న గౌరవ కెసీఆర్ గొప్ప మనసుతో వీరి సమస్యల్ని పరిష్కరించాలని ఆలోచించారు. 12 మంది మంత్రులతో కలిపి కమిటీ వేశారు. నేడు వరంగల్ జిల్లా మంత్రులుగా ఇక్కడ బాల సదన్ ను విజిట్ చేశాం. ఈ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అనాథలకు మంచి పాలసీ రాబోతుంది. అనాథ పిల్లల తరపున సీఎం కేసిఆర్ కి పాదాభివందనం. అనాథల జీవితంలో వెలుగు తెచ్చే కార్యక్రమాన్ని సీఎం కేసిఆర్ శ్రీకారం చుట్టారు. దేశంలో ఇది ఒక ఆదర్శంగా ఉండబోతోందన్నారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం బాలికా సదనంలో ఆశ్రయం పొందుచున్న పిల్లలకు విద్యా వైద్య సౌకర్యాలు కల్పిస్తూ మానసిక వికాసం, సృజనాత్మకతను పెంపొందించుకొనుటకు వారిని వినోదం, విజ్ఞాన, విహార యాత్రలు, వీకెండ్ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం మంత్రులు మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో 59వ డివిజన్ కార్పొరేటర్ వసంత మహేందర్ రెడ్డి, ఆర్డీవో వాసుచంద్ర, హన్మకొండ ఏసిపి జితేందర్ రెడ్డి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ అన్నమనేనీ అనిల్ చందర్ రావు,సభ్యులు కే దామోదర్, పి సుధాకర్, ఆర్ జే డీఝాన్సీ లక్ష్మీబాయి,అర్బన్, రూరల్ జిల్లాల సంక్షేమ అధికారులు ఎం సబిత, ఎం శారద, తహశీల్దార్ గనిపాక రాజు, బాలికా సదనం సూపరింటండెంట్ కే వెరోనిక, డీసీపీవోలు పి సంతోష్ కుమార్, జీ మహేందర్ రెడ్డి, ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎస్ ప్రవీణ్ కుమార్, ఏ సతీష్ కుమార్, మరియు మెరుగు శ్రీనివాసులు,జీ సునీత, ఏ మాధవి, ఎం సుజాత, పి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -