బీజేపీ అసత్య ప్రచారాలను ఎవరు నమ్మొదు- కేటీఆర్‌

225
ktr speech
- Advertisement -

గురువారం టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజేంద్రనగర్‌ నియోజకవర్గం మైలార్‌దేవ్‌పల్లిలో మంత్రి ఈ సాయంత్రం రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కొంతమంది ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు.ఎవరు నమ్మవద్దన్నారు. భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో టి.ఆర్.ఎస్ ప్రభుత్వం 10 వేల రూపాయలు ఇస్తుంటే ఉత్తరాలు రాసి ఆపింది బీజేపీ వాళ్ళు కాదా అని మంత్రి ప్రశ్నించారు. హైదరాబాద్‌లో వర్షాలు కురుసినప్పుడు రాని కేంద్ర మంత్రులు జిహెచ్ఎంసి ఎన్నికలప్పుడు వస్తున్నారని ఎద్దేవ చేశారు. 10 వేల రూపాయలు అందని వారందరికీ డిసెంబర్ 4 తర్వాత అందరికి అందిస్తాం. ఇందులో ఎవరు అనుమానం పడాల్సిన అవసరం లేదని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.

ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం గత ఆరేండ్లుగా ప్రజలకు మాయమాటలు చెప్పుడే తప్ప చేసిందేమి లేదన్నారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హైదరాబాద్‌లో తాగునీరు, కరెంట్‌ సమస్యలను పరిష్కరించిందన్నారు. డిసెంబర్‌ నుంచి మంచినీటి బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించారన్నారు. శాశ్వతంగా మంచినీటి బిల్లులు కట్టాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం కారణంగానే పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ముందుకు వస్తున్నాయన్నారు. రాష్ర్టానికి కేంద్రం ఇచ్చింది ఏం లేదన్నారు. ప్రజల ఖాతాల్లో డబ్బు వేస్తామని మాయమాటలు చెప్పారన్నారు. అమ్మకు అన్నం పెట్టని వారు.. చిన్నమ్మకు బంగారం పెడతారంట అని మంత్రి ఎద్దేవ చేశారు. రాజేంద్రనగర్‌ టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ అభ్యర్థిగా కోరంటి శ్రీలత, అత్తాపూర్‌ నుంచి మాధవి అమరేందర్‌, మైలార్‌దేవ్‌పల్లి నుంచి ప్రేమ్‌దాస్‌ గౌడ్‌ లను భారీ మెజార్టీతో గెలిపించి బల్దియాకు పంపాల్సిందిగా మంత్రి కేటీఆర్‌ కోరారు.

- Advertisement -