రాహుల్‌కు విందులు, చిందులు మాత్ర‌మే తెలుసు.. కేటీఆర్ ఫైర్‌..

53
Minister ktr
- Advertisement -

నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. శనివారం ఆయన నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌లు చేశారు. అనంతరం హాలియాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. గ‌త పాల‌కుల హ‌యాంలో వెనుక‌బాటుకు గురైన నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. ఎమ్మెల్యే నోముల భ‌గ‌త్‌కు, నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గానికి అండ‌గా ఉంటామ‌ని కేటీఆర్ తేల్చి చెప్పారు.

ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో ఎమ్మెల్యే నోముల భ‌గ‌త్.. రూ. 820 కోట్లతో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాలు ప్రారంభించార‌ని కేటీఆర్ తెలిపారు. ద‌శాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ప‌నులు ఈ యువ నాయ‌కుడు మీ అంద‌రికీ చేసి పెడుతున్నాడు. నెల్లిక‌ల్ ఎత్తిపోత‌ల ప‌థ‌కం ప‌రుగులు పెడుతున్న‌ది. ఈ ఎత్తిపోత‌ల‌ను రూ. 670 కోట్ల‌తో పూర్తి చేస్తామ‌న్నారు. ముఖ్య‌మంత్రి ఇచ్చిన మాట ప్ర‌కారం.. మిగిలిన ఆయ‌క‌ట్టును ఈ ఎత్తిపోత‌ల ద్వారా స‌స్య‌శ్యామ‌లం చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. మిగిలిన ఆయ‌క‌ట్టుకు సాగునీరు వ‌చ్చే రోజులు ద‌గ్గ‌ర్లోనే ఉన్నాయ‌ని కేటీఆర్ తెలిపారు. ఆధునీక‌మైన మినీ స్టేడియం కోసం రూ. 3 కోట్ల 75 ల‌క్ష‌లు మంజూరు చేశామ‌న్నారు. ఓపెన్ డ్రైన్ స‌మ‌స్య ప‌రిష్కారానికి రూ. 15 కోట్లు మంజూరు చేస్తామ‌ని కేటీఆర్ ప్ర‌క‌టించారు.

ఈ నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హించిన పెద్ద‌లు మంత్రిగా సుదీర్ఘ‌కాలం ప‌ని చేశారు. కానీ అభివృద్ధి విష‌యంలో ఈ జిల్లాకు ఏం చేయ‌లేదని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. ప‌క్క‌నే కృష్ణా న‌ది ఉన్న‌ప్ప‌టికీ ఫ్లోరోసిస్‌తో బాధ‌ప‌డ్డారు. అయిన‌ప్ప‌టికీ నీళ్లు ఇవ్వ‌లేని అస‌మ‌ర్థ‌త ఆ నాయ‌కుల‌ది. తాగునీరు ఇవ్వ‌కపోయిన‌ప్ప‌టికీ, సాగునీటి రంగంలోనూ ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాను నిర్ల‌క్ష్యం చేశారని కేటీఆర్ నిప్పులు చెరిగారు. రూ. 46 వేల కోట్లు ఖ‌ర్చు పెట్టి మిష‌న్ భ‌గీర‌థ‌ను తీసుకొచ్చి తండా, గూడెంలోని ఇంటింటికి సుర‌క్షిత‌మైన తాగునీరు అందిస్తున్నామ‌ని తెలిపారు. ఆరేడు ద‌శాబ్దాలుగా అధికారంలో ఉండి.. ఈ జిల్లాకు వారు ఏం చేయ‌లేదు. తెలంగాణ ఉద్య‌మంలో అనేక‌సార్లు మ‌న‌ల్ని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలో అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల మాదిరిగా ముందుకు వెళ్తుందని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై మంత్రి కేటీఆర్ మ‌రోసారి నిప్పులు చెరిగారు. ఆయ‌న‌కు రైతులు, ఎడ్లు, వ‌డ్లు తెల్వ‌దు.. విందులు, చిందులు మాత్ర‌మే తెలుసని కేటీఆర్ మండిప‌డ్డారు. వ‌రంగ‌ల్ స‌భ‌లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వాల‌ని అడిగిన విష‌యాన్ని కేటీఆర్ గుర్తు చేస్తూ నిప్పులు చెరిగారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హించిన పెద్దాయ‌న‌కు ఎన్నిసార్లు అవ‌కాశం ఇచ్చారు. ఏడు సార్లు అవ‌కాశం ఇచ్చినా ఏం ఉద్ధ‌రించ‌లేదు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి 10 సార్లు అవ‌కాశం ఇచ్చారు.. 50 ఏండ్లు వారే ప‌రిపాలించారు. 50 ఏండ్లు ఏం చేయ‌లేనోడు.. ఇంకొక్క చాన్స్ ఇవ్వండని అడుగుతుండు. రైతు సంఘ‌ర్ష‌ణ స‌భ కాదు.. అది కాంగ్రెస్ నేత‌లు ఒక‌రికొక‌రు త‌న్నుకుంటున్నారు. ప్ర‌జ‌ల‌ను, రైతుల‌ను అయోమ‌యానికి గురి చేసే దిక్కుమాలిన క‌థ అని కోపోద్రిక్తుల‌య్యారు.

ఫ్లోరోసిస్ ను ఎందుకు అరిక‌ట్ట‌లేదు. రైతుబంధు, రైతుబీమా ఎందుకు ఇవ్వ‌లేదు. నెల్లిక‌ల్ లిఫ్ట్‌ను ఎందుకు పూర్తి చేయ‌లేదు. ఈ ప్ర‌శ్న‌ల‌కు వారి నుంచి స‌మాధానం రాదు. ఊక‌దంపుడు ఉప‌న్యాసాలు త‌ప్ప మ‌నం అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చే ప‌రిస్థితి లేదు. సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక సంద‌ర్భంగా కేసీఆర్ ఇచ్చిన ప్ర‌తి మాట నిల‌బెట్టుకున్నారు. నాగార్జున సాగ‌ర్ అభివృద్ధిలో ముందుకు పోతోంది. డిగ్రీ కాలేజీ ఇస్తానని చెప్పారు. అది కూడా ఇచ్చారు.. ఆ ప‌నులు జ‌రుగుతున్నాయి. దీంతో పాటు అన్ని ప‌నులు అభివృద్ధి ప‌థంలో ఉన్నాయ‌ని కేటీఆర్ తెలిపారు.

సంక్రాంతికి గంగిరెద్దులు వ‌చ్చిన‌ట్లు మ‌ళ్లీ ఆ పార్టీల నాయ‌కులు వ‌స్త‌రు.. ఎన్నిక‌లు రాగానే ఊపుకుంటూవ‌చ్చి ఉప‌న్యాసాలు ఇస్త‌రు. గ‌తంలో చేసిందేమీ లేదు కానీ మా తాత‌లు నేతులు తాగిండ్రు, మా మూతుల వాస‌న‌లు చూడండి.. మేం చాలా పెద్ద‌వాళ్లం.. ఏడెనిమిది సార్లు మేం ఏమో చేసినం అని చెప్ప‌డానికి వ‌స్త‌రు. ద‌య‌చేసి వారిని న‌మ్మొద్దు.. విశ్వ‌సించొద్దని నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు కేటీఆర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -