బండి సంజయ్‌కి మంత్రి ప్రశాంత్‌ రెడ్డి సవాల్‌..

139
Minister Vemula
- Advertisement -

తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా అమలు కావడం లేదని, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి రెడ్డి అన్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌, రైతుబంధు, రైతుబీమా, ఇంటింటికీ రక్షిత మంచినీరు, ఆసరా పెన్షన్లు, కేసీఆర్‌ కిట్‌, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలవుతుంటే చూపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి సవాల్‌ విసిరారు. బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్‌ మండలం బడాభీంగల్, సికింద్రాపూర్, గోనుగొప్పుల, బెజ్జోరా తదితర గ్రామాల్లో రూ.10 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న పెద్దవాగు వంతెన నిర్మాణాలు, బీటీ రోడ్ల నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల మధ్య విద్వేషాలు, వైషమ్యాలను పెంచి పోషించడం, రెచ్చగొట్టడం తప్ప బీజేపీ నాయకులు చేసిందేమి ఉండదని ఎద్దేవా చేశారు.

నిజంగా బండి సంజయ్‌కి దమ్ముంటే రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాకు చెప్పి తెలంగాణ తరహా పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయించాలన్నారు. అప్పటి వరకు టీఆర్‌ఎస్‌, సీఎం కేసీఆర్‌ను విమర్శించే నైతిక అర్హత బండి సంజయ్‌కి లేదన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తాగునీటి సరఫరా, పరిశుభ్రత, పచ్చదనం, విద్యుత్‌ సరఫరా, వైకుంఠధామాలు, సీసీరోడ్లు, డ్రైనేజీలు తదితర అంశాలను ప్రాతిపదికన తీసుకొని దేశవ్యాప్తంగా 10 ఉత్తమ గ్రామాలను ఎంపిక చేశారని, ఇందులో పదికి పది తెలంగాణ నుంచే ఎంపికయ్యాయని గుర్తు చేశారు. ఈ సర్వేతో అన్ని అంశాల్లోనూ తెలంగాణ దేశంలోనే నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా ఉన్నట్లు వెల్లడైందన్నారు. దీన్ని ప్రజలు గమనించాలని కోరారు. 60 ఏళ్లలో జరిగిన కాంగ్రెస్, బీజేపీ పాలనను, టీఆర్‌ఎస్‌ ఏడేళ్ల పాలనను బేరీజు వేసుకొని తేడాను గమనించాలని ప్రజలను కోరారు.

- Advertisement -