సిమెంట్ ఇండియా కార్పొరేషన్‌ పునరుద్దరణపై మంత్రి కేటీఆర్

46
adilabad
- Advertisement -

ఆదిలాబాద్ లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభుత్వం పైన తెలంగాణ ప్రభుత్వం తరఫున మరింత ఒత్తిడి తీసుకువస్తామని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ తెలిపారు. ఆదిలాబాద్ కు చెందిన స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీ జోగు రామన్న తో పాటు ఆదిలాబాద్ నాయకులు, జిల్లాలోని ఇతర ప్రముఖులు ఈ రోజు మంత్రి కేటీఆర్ ను ప్రగతి భవన్ లో కలిసి కంపెనీ పునః ప్రారంభానికి చేపట్టాల్సిన ఆందోళన కార్యాచరణపై చర్చించారు. కంపెనీ పునః ప్రారంభం కోసం తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేస్తున్నామని, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఈ మేరకు నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరిన విషయాన్ని ఈ సందర్భంగా తెలిపారు.

సీసీఐ పునః ప్రారంభానికి అవసరమైన అన్ని రకాల ప్రత్యేక రాయితీలను ఇస్తామని, కొత్త కంపెనీని ఏర్పాటు చేస్తే ఎలాంటి రాయితీలు తెలంగాణ ప్రభుత్వం నుంచి అందుతాయో వాటిని సీసీఐ కి అందించేందుకు సిద్ధంగా ఉన్న విషయాన్ని మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. ఒకవైపు ఉమ్మడి ఆదిలాబాద్ లో అనేక పరిశ్రమలను స్థాపించి జిల్లాలో ఉపాధి అవకాశాల కల్పన కోసం మేము ప్రయత్నం చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అప్పనంగా అమ్మేసేందుకు కుట్ర చేస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదిలాబాద్ లోని సీసీఐ పునరుద్ధరణ చేయాలని ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులను స్వయంగా కలిశామని, అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేశామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

అయితే ఇప్పటిదాకా కేంద్రం నుంచి ఎలాంటి సానుకూల స్పందన లేదన్నారు. ఇప్పటికే ఆదిలాబాద్ లోని సిర్పూర్ పేపర్ మిల్లుని ప్రారంభించిన చరిత్ర, నిబద్ధత మాకు ఉందన్నారు. మరోవైపు జిల్లాకు సిరుల వరప్రధాయిని అయిన సింగరేణిని క్రమంగా ప్రైవేటీకరించే ప్రయత్నాలకు కేంద్రం తెరలేపిందని కేటీఆర్ అన్నారు. సీసీఐ విషయంలో అవసరమైతే ఆదిలాబాద్ యువత ప్రయోజనాల కోసం ఢిల్లీకి సైతం వెళ్లి కేంద్రంపై ఒత్తిడి చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. త్వరలోనే ఆదిలాబాద్ కు ఐటీ టవర్ ను మంజూరు చేస్తామని, దీంతో పాటు టెక్స్ టైల్ పార్కు ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను సైతం సిద్ధం చేయాలని అధికారులను కోరినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.

- Advertisement -