గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. బీజేపీకి ఓటు వేయకుంటే భాగ్యనగరంపై బాంబులతో దాడులు చేస్తారా? అని ఆ పార్టీ నేతలను ప్రశ్నించారు. కొత్తపేట డివిజన్లో ప్రచారం నిర్వహించిన మంత్రి….బీజేపీ నాయకుల తీరును తప్పుబట్టారు.
2014లో అదుపు తప్పిన శాంతిభద్రతలను ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఏర్పాటైన తెలంగాణ ప్రభుత్వం అదుపులోకి తీసుకువచ్చిందన్నారు.గతంలో నగర శివారులో నివాసం ఉండాలి అంటేనే జనం భయపడేవారని.. వారికి టీఆర్ఎస్ ప్రభుత్వం రక్షణ కల్పించిందన్నారు.
ప్రపంచ దేశాలను కన్నతల్లిలా హైదరాబాద్ అక్కున చేర్చుకుందని, అలాంటి నగరంపై సర్జికల్ స్ట్రయిక్లంటూ కమలనాథులు అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజలకు కల్పించే మౌలిక సదుపాయాలు, అభివృద్ధిని విస్మరించి సర్జికల్ స్ట్రయిక్ అంటూ నగర ప్రజల్లో భయాందోళనలను సృష్టించేందుకు బీజేపీ కుట్ర పన్నుతుందని ఆరోపించారు.