నీలోఫర్‌లో ఐసీయూ వార్డును ప్రారంభించిన- మంత్రి హరీష్‌

156
- Advertisement -

రాబోయే రోజుల్లో రూ. 10 వేల కోట్లతో ఆరోగ్యశాఖను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు తెలిపారు.. హైదరాబాదులోని నీలోఫర్ ఆసుపత్రిలో 100 పడకల ఐసీయూ వార్డును మంత్రి హరీష్‌ రావు ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు మారేలా వైద్యులు సేవలందించాలని కోరారు. ఆరోగ్యమంత్రిగా తొలి కార్యక్రమం నీలోఫర్‌లో పాల్గొనడం సంతోషకరంగా ఉందని చెప్పారు. నీలోఫర్‌లో రూ. 33 కోట్లతో మరో 800 పడకలను అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి అన్నారు.

కరోనా సెకండ్ వేవ్ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతమయ్యాయని అన్నారు. కరోనా మూడో వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని… దానికోసం రూ. 133 కోట్లు కేటాయించామని చెప్పారు. కేసీఆర్ కిట్ కారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య 30 శాతం నుంచి 50 శాతానికి పెరిగిందని తెలిపారు. రాష్ట్రంలో మరో 8 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. హైదరాబాద్ నగరానికి నలువైపులా మెడికల్ టవర్లను నిర్మించేందుకు కృషి చేస్తామని మంత్రి హరీష్‌ పేర్కొన్నారు.

- Advertisement -