బీజేపీకి ఎందుకు ఓటు వెయ్యాలి.? ఈటలపై మంత్రి హరీష్ ఫైర్‌..

102
- Advertisement -

హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ ప్రచారంలో దూసుకుపోతుంది. ఈరోజు ఇల్లంతకుంట మండలం వంతడుపులలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇది నడమంతరపు ఎన్నిక.. ఈటెల రాజేందర్ ఎందుకు రాజీనామా చేశారు. హుజురాబాద్‌ను జిల్లాలు చేయాలని చేశారా..లేక అభివృద్ధి కోసం చేశారా.. ఎవరైనా రాజీనామాలు చేస్తే అనారోగ్యంతో ఉంటే నో లేకుంటే అభివృద్ధి కోసమే చేస్తారు.. ఈటెల ఓ మెడికల్ కాలేజీ కావాలనో.. హుజురాబాద్ జిల్లా కావాలనో.. రాజీనామా చేయలేదు కేవలం తన ఆస్తులు కాపాడుకునేందుకు మాత్రమే రాజీనామా చేసి బీజేపీలో చేరారు అని మంత్రి హరీష్‌ విమర్శించారు.

ఈటల రాజేందర్ సంపన్నుడు.. ఆయన ఎలాగైనా బతకగలడు.. కానీ గెల్లు శ్రీనివాస్ నిరుపేద ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్న నాయకుడు.. తెలంగాణ కోసం ఉద్యమించాడు, జైలుకు వెళ్లాడు… కేసుల పాలయ్యాడు అని తెలిపారు. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు నమ్మరు. గతంలో కాలువలో నీళ్ల కోసం రైతులు ఎదురు చూసే వాళ్ళు.. కానీ నేడు పరిస్థితి మారిపోయింది. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కాళేశ్వరం నీళ్ళు కనబడుతున్నాయి..నెత్తి మీద గంగమ్మ ఉన్నట్లుగా ఉంది. కాలానికి సంబంధం లేకుండా నీళ్లు ప్రతి చోటికి అందుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద మీట నొక్కితే నీళ్లు పొలాలకు చేరుతున్నాయి.

గతంలో ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయే వి మోటార్లు కాలిపోయే వి.. కానీ నేడు నాణ్యమైన విద్యుత్ సరఫరాతో అలాంటి పరిస్థితులు లేవు. ఉచితంగా నిరంతర విద్యుత్తు రైతులకు అందుతోంది. చేద బావిలో నీళ్లు చెంబుతో ముంచుకునే రోజులు వచ్చాయి.ఇదంతా సీఎం కేసీఆర్ వల్ల సాధ్యమైంది.. మళ్లీ పాత రోజులు వచ్చాయి అని మంత్రి అన్నారు. బిజెపి ప్రభుత్వం రైతుల బావుల దగ్గర మీటర్లు పెట్టే కొత్త చట్టాన్ని తీసుకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో అక్కడి ముఖ్యమంత్రి వైయస్ జగన్ బావులకు మీటర్లు పెట్టే కార్యక్రమం ప్రారంభించారు.. కానీ సీఎం కేసీఆర్ నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మీటర్లు పెట్టనివ్వము అని తేల్చి చెప్పారు.

పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు పెంచిన బిజెపికి ఎలా ఓటేస్తారు? అని మంత్రి ప్రశ్నించారు. గతంలో పొలాన్ని దున్నేందుకు ఇరవై ఐదు వందలు ఖర్చయ్యేది కానీ నేడు ఆ ఖర్చు ఐదు వేలకు చేరుకుంది ఇది బిజెపి వైఫల్యమే..గ్యాస్‌పై సబ్సిడీని తగ్గించారు 400 ఉన్న గ్యాస్ ధర వెయ్యి కి చేరుకుంది పండగ పూట కూడా వినియోగదారులను వదలడం లేదు. పండగ పూట కూడా ప్రతిరోజు ధరలు పెంచుతున్నారు అని మంత్రి మండిపడ్డారు. కెసిఆర్ ఎకరానికి 5000 రైతుబంధు ద్వారా ఇస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచి వాటిని గుంజుకునే ప్రయత్నం చేస్తోంది.

మాజీ మంత్రి ఈటల మొసలి కన్నీరు కారుస్తున్నారు.. ఈటెల రాజేందర్ టిఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ చేసింది.. ఆరుసార్లు ఎమ్మెల్యేలు చేసి రెండు సార్లు మంత్రిని చేస్తే కెసిఆర్‌కు గోరి కడతా అని అంటున్నాడు. దీన్ని ప్రజలు గమనించాలి. బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి వేస్తోంది. నిరుద్యోగం పెంచుతోంది. ప్రజల సొమ్మును కార్పొరేట్ సంస్థలకు కట్ట పెడుతోందని దుయ్యబట్టారు. బొట్టు బిల్లా కావాలా లేక కల్యాణలక్ష్మి కావాలా.. కుక్కర్ లు కావాలా గ్రైండర్లు కావాలా లేక పింఛన్లు దళిత బంధు రైతు బంధు కావాలా..? అని మంత్రి ప్రశ్నించారు. దున్నపోతుకు గడ్డి వేసి బర్రెల కు పాలు పిండితే వస్తాయా అని అన్నారు. ఈటెల రాజేందర్ గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి ఓట్లకు రావాలని సూచించారు.

గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలిస్తే ఐదు వేల ఇళ్లు నిర్మించి ఇస్తాం.. గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించండి నియోజకవర్గ అభివృద్ధికి నేను జిమ్మె దార్ తీసుకుంటా.. చేయిస్తా.. మహిళలు ఓటు వేసే ముందు వంటింట్లోకి వెళ్లి గ్యాస్ సిలిండర్‌కు దండం పెట్టి పోలింగ్ కేంద్రానికి వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలి అని మంత్రి కోరారు. బిజెపి వాళ్లు బట్ట కాల్చి మీద వేస్తున్నారు. ఈటల రాజేందర్ సభలో కరెంటు పోతే నేనే తీయించాలని ప్రచారం చేశారు నేను అధికారులకు ఫోన్ చేశాను ఆ ఫంక్షన్ హాల్‌కు కరెంటు లేదని రెండు నెలల కింద బిల్లు కట్టలేదని తొలగించామనీ అని చెప్పారు. జనరేటర్‌లో డిజిల్ అయిపోయి కరెంటు పోతే ఆ నెపాన్ని కూడా నా మీదకు నెడుతున్నారు అని తెలపారు.

వాళ్ల వాహనాల మీద వాళ్లే దాడి చేయించుకుని నా మీదకు తోసే అవకాశం కూడా ఉంది. నిరుపేదల ఆడబిడ్డల వివాహానికి ఇచ్చే కల్యాణలక్ష్మి కడుపు నింపదని, ఆసరా పింఛన్లు పరిగే ఏరు కున్నట్లు అని ఈటెల అవమానించారు. ఇలా బిజెపి నాయకులు జూటా మాటలు మాట్లాడుతున్నారు. బిజెపి నాయకులకు అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు.. బండి సంజయ్ ఎంపీగా గెలిచిన తర్వాత ఒక్కపైసా అయినా కేంద్రం నుండి తీసుకువచ్చాడా?.. అని ప్రశ్నించారు. నల్ల చట్టాలు తెచ్చి దానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులపై దాడులు చేసింది బిజెపి ప్రభుత్వం.. నిన్న కాక మొన్న రైతులు ఉత్తరప్రదేశ్‌లో ఆందోళన చేస్తే.. వాళ్ల పైకి కారు ఎక్కించి చంపారు. కానీ తెలంగాణలో రైతులను కేసీఆర్ అన్ని విధాలుగా ఆదుకుంటూ కాపాడుకుంటున్నారని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -