ఇచ్చిన మాట ప్రకారం ఇంటింటికీ మంచినీరు- ఎర్రబెల్లి

158
minister errabelli
- Advertisement -

ఈ నెల 12వ తేదీన వరంగల్ లో రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, చేనేత, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పర్యటన నేపథ్యంలో ఆయా కార్యక్రమాల ప్రాంతాలను పరిశీలించారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, వరంగల్ మహా నగర పాలక సంస్థ నోడల్ ఆఫీసర్, వరంగల్ అర్బన్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, కమిషనర్ పమేలా సత్పతీ, ఇతర అధికారులతో కలిసి మంత్రి ఎర్రబెల్లి, కేటీఆర్ ప్రారంభించనున్న, శంకుస్థాపన చేయనున్న కార్యక్రమాలను స్వయంగా పరిశీలించారు.

వరంగల్ మహా నగరానికి ప్రతి రోజూ నీరు, ఆరోజు కేటీఆర్ విడుదల చేయనున్న రాంపూర్ మిషన్ భగీరథ పంప్ హౌజ్, అంబేద్కర్ జంక్షన్, దేశాయ్ పేట జర్నలిస్టుల కాలనీ, ఎల్ బి నగర్ షాది ఖానా, మండి బజార్ హజ్ హౌజ్, లక్ష్మీపురం సమీకృత మార్కెట్, లేబర్ కాలనీ 2BHK ఇళ్లు, శివనగర్ తదితర ప్రాంతాలను మంత్రి స్వయంగా పరిశీలించారు. అధికారులకు తగు సూచనలు చేశారు. ఆయా కార్యక్రమాలను విజయవంతం చేయడానికి అవసరమైన సూచనలు చేశారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ఈ నెల 12న మంత్రి కేటీఆర్, 1700 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.ఇందులో పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉంటాయి. వరంగల్ మహా నగరానికి ప్రతి రోజూ శుద్ధి చేసిన, ఆరోగ్యకరమైన మిషన్ భగీరథ మంచినీరు అందించడానికి 950 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం ఉగాది రోజు నుండే వరంగల్ మహా నగర ప్రజలకు ఇంటింటికీ ప్రతీ రోజూ మంచినీరు అందుతుందని మంత్రి తెలిపారు.

ఇవేగాక అనేక కార్యక్రమాలు కూడా ఆరోజు ఉంటాయి. వరద ముంపు ప్రాంతాల్లో కూడా అభివృద్ధి పనులు ఉన్నాయి. చారిత్రాత్మక వరంగల్లో… చరిత్రలో ఎన్నడూ లేనంత అభివృద్ధి తెలంగాణ వచ్చాక, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల అధ్వర్యంలో జరుగుతున్నది. ఇంత పెద్ద మొత్తం నిధులు రావడం కూడా వారి వల్లే సాధ్యమైంది. ప్రజలను భాగస్వాములను చేస్తూ, జరుగుతున్న ఈ అభివృద్ధి జాతర, వరంగల్ చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.

- Advertisement -