సింగరేణికి జాతీయ స్థాయి అత్యుత్తమ అవార్డు..

209
Singareni
- Advertisement -

థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నుండి వెలువడే ఫ్లైయాష్‌ను నూరు శాతం పైబడి సద్వినియోగ పరిచినందుకు గుర్తింపుగా సింగరేణి థర్మల్‌ విద్యుత్తు కేంద్రానికి జాతీయ స్థాయిలో అత్యుత్తమ ఫ్లైయాష్‌ వినియోగ సంస్థగా అవార్డు లభించింది. గోవాలో రెండు రోజులుగా మిషన్‌ ఎనర్జీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఫ్లైయాష్‌ వినియోగంపై జరుగుతున్న అంతర్జాతీయ స్థాయి సదస్సు ముగింపు సందర్భంగా శనివారం (ఏప్రియల్‌ 10వ తేదీ) నాడు ఈ అవార్డును సింగరేణి డైరెక్టర్‌ (ఇ&ఎం) డి.సత్యనారాయణ రావు మిషన్‌ ఎనర్జీ ఫౌండేషన్‌ డైరెక్టర్‌ మనోజ్‌ కుమార్‌ నుండి అందుకొన్నారు. 500 మెగావాట్ల పైబడి విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్న థర్మల్‌ ప్లాంట్ల విభాగంలో సింగరేణి ఈ అవార్డును అందుకొంది.

దీనిపై సింగరేణి సి&ఎం.డి. ఎన్‌.శ్రీధర్‌ తన హర్షం ప్రకటించారు. సింగరేణి థర్మల్‌ విద్యుత్తు కేంద్రంలో ఫ్లైయాష్‌, బాటంయాష్‌ లను ఏమాత్రం స్టాకు ఉంచకుండా నూరుశాతం సద్వినియోగం చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా మొదటినుండే కృషి చేస్తున్నామనీ, దీనికి ఫలితంగా జాతీయ స్థాయి అవార్డు రావడం సంతోషంగా ఉందని సంస్థ సి&ఎం.డి. తెలియజేశారు.

ప్రధానంగా సిమెంటు కంపెనీలకు రవాణ:
సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నుండి వెలువడే ఫ్లైయాష్‌ ను ప్రధానంగా సిమెంటు కంపెనీలకు రవాణా చేస్తున్నారు. సింగరేణి 2020-21లో 16.86 లక్షల టన్నుల ఫ్లైయాష్‌ను సిమెంటు కర్మాగారాలకు రవాణా చేయడం ద్వారా 107 శాతం ఫ్లైయాష్‌ వినియోగం జరిగింది.తమిళనాడు ఎ.సి.సి. (సిమెంట్స్‌) వారు సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నుండి రైల్వే వ్యాగన్ల ద్వారా ఫ్లైయాష్‌ స్వీకరించడానికి ఒప్పందం కుదుర్చుకొని ఈ ఏడాది ఇక్కడి నుండి ఫ్లైయాష్‌ను స్వీకరిస్తున్నారు. అలాగే కేశోరాం, ఓరియంట్‌ తదితర 10 సిమెంటు కంపెనీలు సింగరేణి ఫ్లైయాష్‌ను వాడుతున్నాయి.

ఉత్పత్తి అయిన ఫ్లైయాష్‌ను ఎప్పటికప్పుడు రవాణా చేస్తూ పూర్తి పర్యావరణ హిత ప్లాంటుగా సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం పేరుతెచ్చుకొంది. ఎన్‌.టి.పి.సి., ఎస్‌.సి.ఎల్‌. వంటి ప్రభుత్వ సంస్థలతో పాటు అదానీ, టాటా, జె.కె. వంటి సుమారు 150 ప్రైవేటు థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలను మించి సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ఈ అవార్డును పొందడం పట్ల సర్వత్రా హర్షం అవుతోంది.

- Advertisement -