సుప్రీంకు మీనాక్షి నటరాజన్

6
- Advertisement -

మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో తన నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రిటర్నింగ్ అధికారి తీసుకున్న నిర్ణయాన్ని ఆమె అత్యున్నత న్యాయస్థానంలో సవాలు చేశారు. తన అభ్యర్థిత్వంపై అనర్హత వేటు వేస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. రాజ్యసభ రేసు నుండి నటరాజన్ తప్పుకోవాల్సి రావడంతో బీజేపీకి కలిసి వచ్చింది. దీంతో ఆ పార్టీ అభ్యర్థి మహేష్ కేవత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం దక్కింది.తద్వారా రాష్ట్రంలోని మూడు స్థానాలనూ అధికార బీజేపీ కైవసం చేసుకోనుంది.

తన పిటిషన్‌లో రిటర్నింగ్ అధికారి నిర్ణయాన్ని కక్షపూరితమైనది, పక్షపాతంతో కూడినది మరియు చట్టవిరుద్ధమైనది గా నటరాజన్ అభివర్ణించారు. ఆ ఉత్తర్వును ఆలస్యం చేయకుండా పక్కన పెట్టాలని ఆమె సుప్రీంకోర్టును అభ్యర్థించారు.

నామినేషన్ తిరస్కరణ చట్టపరంగా చెల్లదని ఇది ఎన్నికల ప్రక్రియను తీవ్రంగా ప్రభావితం చేసిందని వాదిస్తూ ఈ పిటిషన్‌లో అత్యవసర ఉపశమనం కోరారు. ఈ కేసుపై ముందస్తు విచారణ కోరే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్‌లోని మూడు రాజ్యసభ స్థానాలకు జూన్ 18న జరగాల్సిన ఎన్నికలు, మంగళవారం నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురవడంతో ఊహించని మలుపు తిరిగాయి. తన ఎన్నికల అఫిడవిట్‌లో సమాచారాన్ని దాచారనే ఆరోపణలపై ఈ నిర్ణయం తీసుకున్నారు.

మూడవ రాజ్యసభ స్థానానికి పోటీ పడుతున్న బీజేపీ అభ్యర్థి మహేష్ కేవత్ ఈ అభ్యంతరాన్ని లేవనెత్తారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి అరవింద్ శర్మ.. నటరాజన్ తన నామినేషన్ పత్రాలతో పాటు సమర్పించిన ఫారమ్ 26 లో ఒక కోర్టు ఫిర్యాదుకు సంబంధించిన వివరాలను వెల్లడించడంలో విఫలమయ్యారని తద్వారా ఆమె అసంపూర్తిగా ఉన్న అఫిడవిట్‌ను సమర్పించారని తీర్పు ఇచ్చారు.

- Advertisement -