స్నేహం, ప్రేమ, త్యాగం నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న చిత్రం ‘మహర్షి’. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా బ్యానర్లపై సి.అశ్వినీదత్, దిల్ రాజు, ప్రసాద్ వి.పొట్లూరి నిర్మిస్తున్నారు. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఉగాది కానుకగా మహేష్ ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇవ్వనున్నారు. ఈ సినిమా టీజర్ ను ఉగాది రోజున విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మహేష్బాబు టాకీ పార్ట్ పూర్తైంది. తన పాత్రకు డబ్బింగ్ కూడా మొదలుపెట్టారని అంటున్నారు. ఈ సినిమాలో మహేష్బాబు రెండు రకాల గొంతులతో మాట్లాడనున్నారట.
ఇక మహేష్ కెరీర్లోనే ‘మహర్షి’ డిజిటల్, శాటిలైట్ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాయి. డిజిటల్ రైట్స్ను రూ.11 కోట్లకు అమెజాన్ ప్రైమ్ ఇండియా సొంతం చేసుకుందని సమాచారం. డిజిటల్ రైట్సే కాకుండా శాటిలైట్ హక్కులు కూడా భారీ ధర పలికాయని తెలుస్తోంది. ‘మహర్షి’ శాటిలైట్ హక్కులను జెమిని టీవీ రూ. 16.8 కోట్లకు కొనుగోలు చేసిందని టాక్. మే 9న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.