ఈ ఏడాది ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాల్లో యాక్షన్ ఎంటర్టైనర్ ‘మహాసముద్రం’ కూడా ఒకటి. ప్రామిసింగ్ హీరోలు శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా నటించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకమైన నిర్మాణసంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ కలిసి ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాయి. ఈ చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్, అదితీరావ్ హైదరీ హీరోయిన్లుగా నటించారు.‘మహాసముద్రం’ క్యారెక్టర్ లుక్స్ పోస్టర్స్ను బట్టి సినిమాలోని ప్రతి పాత్రకు ప్రాముఖ్యం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన శర్వానంద్, సిద్దార్థ్, అదితిరావ్ హైదరీ, అనూ ఇమ్మాన్యుయేల్, జగపతిబాబు, రావు రమేష్, గరుడ రామచంద్ర ఫస్ట్లుక్ పోస్టర్స్కు ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.
తాజాగా రిలీజ్ డేట్ని అనౌన్స్ చేసింది చిత్రయూనిట్. ఈ చిత్రం అక్టోబర్ 14న దసరా పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. విడుదల తేదీని ప్రకటిస్తూ శర్వా, సిద్ధార్థ్ ఒకరిపై ఒకరు తుపాకులు గురిపెట్టిన పోస్టర్ ను విడుదల చేశారు.
ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మాం ఈ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని నిర్మిస్తున్నారు. రాజ్తోట ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ప్రవీణ్ కేఎల్ ఎడిటర్ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్గా వర్క్ చేశారు.