జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై నటి శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా నిరసిస్తూ, మరో నటి మాధవీలత నిరసన చేసేందుకు జూబ్లీహిల్స్ లోని ఫిల్మ్ చాంబర్ ముందు దీక్షకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. “పోరాటం అంటే తిట్లే కాదు… మౌనంగానూ నిరసిద్దాం” అని రాసిన ప్లకార్డుతో ఆమె మౌన దీక్షకు దిగగా, అక్కడ భారీ ఎత్తున సినీ అభిమానులు చేరారు. ఇదే సమయంలో శ్రీరెడ్డి అభిమానులు అక్కడికి చేరుకుంటుండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి, మాధవీలతను అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
మాధవీలతకు పవన్ కల్యాణ్ అభిమానుల నుంచి, ‘మా’ ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే అక్కడికి చేరుకున్న పవన్ అభిమానులు ఆమెతో పాటు దీక్షలో కూర్చోగా, పోలీసులు అడుగుతున్న ప్రశ్నలకు మాధవీలత సమాధానాలను కాగితంపై రాస్తోంది. తాము స్లోగన్స్ ఇవ్వబోమని, మౌనంగా ఒంటిగంట వరకూ కూర్చుంటానని ఆమె రాసి చూపింది.
అయితే ఈ నేపథ్యంలో సంఘటనా ప్రదేశానికి చేరుకున్న పోలీసులు మాధవీలత దీక్షను భగ్నం చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇలాంటి దీక్షలు చేసేటప్పుడు లోకల్ పరిధిలో ఉన్న పీఎస్ పర్మిషన్ తీసుకోవాలని, అలాంటిదేమీ లేకుండా దీక్ష చేయరాదని అభ్యంతరం వ్యక్తం చేస్తూ… మాధవీలతను, ఆమెకు మద్దతుగా ఉన్నవారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. నిన్న జీవిత రాజశేఖర్ మీడియా సమావేశంలో మాట్లాడిన దగ్గర నుంచి ఒక రకమైన కదలిక వచ్చింది. శ్రీరెడ్డి ప్రత్యేకించి పవన్ను టార్గెట్ చేస్తోందని తెలిసిన దగ్గరనుంచి ఇండస్ట్రీలో ఒక్కొక్కరు నోరు విప్పుతున్నారు.