ఉచితంగా మ్యూటేషన్: సీఎం కేసీఆర్

229
cm kcr
- Advertisement -

దేశంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తులు కలిగివున్న ప్రజలందరికీ మెరూన్ కలర్ పట్టాదార్ పాస్ బుక్స్ జారీచేయనున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు వెల్లడించారు. ఇప్పుడు అమలులోకి తెస్తున్న విప్లవాత్మక రెవెన్యూ చట్టం ద్వారా పేద, మధ్య తరగతి సహా ప్రజలందరి ఆస్తులకు పూర్తి స్థాయి రక్షణ కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని సీఎం పేర్కోన్నారు. ప్రజల యొక్క దీర్ఘకాలిక, విశాల ప్రయోజనాలను ఆశించి ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు సిఎం తెలిపారు. భూ వివాదాలు , ఘర్షనల నుండి ప్రజలను శాశ్వతంగా రక్షించడం కోసం వారి ఆస్తులకు పక్కా హక్కులు కల్పించడం కోసం ఈ పాస్ పుస్తకాలను జారీ చేస్తున్నట్లు సీఎం చెప్పారు.

రెవెన్యూ చట్టం అమలు, ధరణి పోర్టల్ లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు అంశాలపై ప్రగతి భవన్ లో ఇవాళ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రులు శ్రీ కె.టి. రామారావు, శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీ పువ్వాడ అజయ్ కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు శ్రీ రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేష్ కుమార్, ఎమ్మెల్యేలు శ్రీ బాజిరెడ్డి గోవర్దన్, శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి, శ్రీ గణేష్ బిగాల, శ్రీ ఆశన్నగారి జీవన్ రెడ్డి, శ్రీ సండ్ర వెంకటవీరయ్య, శ్రీ గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీలు శ్రీ మాదిరెడ్డి శ్రీనివాస రెడ్డి, శ్రీ బాలసాని లక్ష్మినారాయణ, సీఎంఒ ముఖ్యకార్యదర్శులు శ్రీ నర్సింగ్ రావు, శ్రీమతి స్మితా సభర్వాల్, ఓఎస్డి శ్రీ భూపాల్ రెడ్డి, ఎంఎయూడి ముఖ్యకార్యదర్శి శ్రీ అరవింద్ కుమార్, డైరెక్టర్ శ్రీ సత్యనారాయణ, పంచాయతిరాజ్ సెక్రటరీ శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ శ్రీ రఘునందన్ రావు, జిహెచ్ఎంసి కమిషనర్ శ్రీ లోకేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పోరేషన్ల పరిధిలోని ఇండ్లు, ప్లాట్లు, వ్యవసాయ భూముల దగ్గర నిర్మించుకున్న బావుల కాడి ఇండ్లు, ఫామ్ హౌజ్ లు తదితర వ్యవసాయేతర ఆస్తులన్నింటినీ ఒక్క పైసా చెల్లించకుండా ఉచితంగా ఆన్ లైన్ లో ఎన్ రోల్ (మ్యూటేషన్) చేయించుకోవాలని సీఎం రాష్ట్ర ప్రజలకు విజప్తి చేశారు. ఇక ముందు ఒక ఇంచు భూమి ఒకరి పేరు నుండి మరొకరి పేరు మీదకి బదిలీ కావాలంటే ధరణి పోర్టల్ ద్వారా మాత్రమే రిజిష్ట్రేషన్ జరుగుతుందని సీఎం తెలిపారు. అందుకే వ్యవసాయేతర ఆస్తుల వివరాలు, ఆధార్ కార్డు వివరాలతో సహా కుటుంబ సభ్యుల వివరాలు పంచాయతి, మున్సిపల్ సిబ్బంది ద్వారా ఇంటి నెంబర్ తీసుకుని ఆన్ లైన్ లో వివరాలు నమోదు చేయించుకోవాలని సీఎం ప్రజలను కోరారు. ఇప్పుడు ఆస్తుల వివరాలను మ్యుటేషన్ చేయించుకోకపోతే భవిష్యత్తులో ఆస్తులను తమ పిల్లలకు బదిలీ చేసే విషయంలో ప్రమాదం తలెత్తే అవకాశం వుందని హెచ్చరించారు. నిరుపేద ప్రజలు ఎన్నో ఏండ్లుగా వుంటున్న ఇండ్ల స్థలాలను పూర్తి స్థాయిలో రెగ్యులరైజ్ చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. దీనివల్ల నిరుపేదల ఇంటి స్థలాలకు రక్షణ ఏర్పడడమే కాకుండా ఆ ఆస్తుల మీద బ్యాంకు రుణాలు తీసుకునే వెసులుబాటు పేదలకు కలుగుతుందని సీఎం పేర్కోన్నారు. ఈ ఆస్తుల మ్యుటేషన్ కు, ఎల్.ఆర్.ఎస్ కు ఏలాంటి సంబంధం లేదని, ఇండ్లు ఎలా నిర్మించారనేది పంచాయతిరాజ్, మున్సిపల్ చట్టాలకు, నిబంధనలకు లోబడే వుంటుందని సిఎం వివరించారు. వ్యవసాయ భూముల పరిధిలోని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ పరిధిలో నిర్మించుకున్న ఇండ్లు తదితర ఆస్తులను ఉచితంగా నాలా కన్వర్షన్ చేయనున్నట్లు సిఎం తెలిపారు. వ్యవసాయ భూముల వద్ద నిర్మించుకున్న ఇండ్లు తదితర ఆస్తుల విస్తీర్ణాన్ని వ్యవసాయ కేటగిరి నుంచి తొలగించే విషయంలో ప్రజలకు సర్పంచులు, ఎంపిటీసిలు, గ్రామ కార్యదర్శులు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సిబ్బంది పూర్తి స్థాయిలో సహకరించాలని సీఎం అన్నారు. ఎంపీఓలు దీన్ని పూర్తి స్తాయిలో పర్యవేక్షించాలని సూచించారు.

‘‘గ్రామాలు, మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రతీ ఇళ్ల వివరాలు ఆన్ లైన్ లో నమోదు కావాలి, ఇంటికి నెంబర్ కేటాయించాలి, ట్యాక్స్ వసూలు చేయాలి, నాన్ అగ్రికల్చర్ కింద నాలా కన్వర్షన్ మార్చాలి. ఈ విషయంలో వంద శాతం ఆస్తుల వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేసే విషయంలో పంచాయతిరాజ్, మున్సిపల్ అధికారులు బాధ్యత తీసుకోవాలి. ధరణి పోర్టల్ కావడంలో కాస్త ఆలస్యమైన పర్వాలేదు కానీ ధరణి పోర్టల్ ప్రారంభమైన తర్వాతే వ్యవసాయ, వ్వవసాయేతర ఆస్తుల రిజిస్టేషన్ ప్రక్రియ జరుగుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎండోమెంట్, వక్ఫ్, ఎఫ్ టిఎల్, నాలా, యు ఎల్ సి పరిధిలో నిర్మించుకున్న ఇండ్లకు ఈ మ్యుటేషన్ వర్తించదని సీఎం స్పష్టం చేశారు. భవిష్యత్ లో ఆస్తుల నమోదు ప్రక్రియను కానీ రెగ్యులరైజేషను కానీ ఉచిత నాలా కన్వర్షన్ చేయడం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదని ఇదే చివరి అవకాశమని సీఎం తెలిపారు.

వ్యవసాయేతర ఆస్తుల ఆన్ లైన్ నమోదు ప్రక్రయతో పాటు ప్రజలకు ప్రభుత్వం అందజేసే మెరూన్ కలర్ పాస్ పుస్తకాలు అందించే విషయంలో మంత్రులు ఎమ్మెల్యేలు, మండల, గ్రామ స్థాయి ప్రజా ప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం సూచించారు. ఆస్తుల వివరాలు ఆన్ లైన్ నమోదులో కూడా అధికారులు, సిబ్బందితో పర్యవేక్షించాలని సీఎం సూచించారు.

గ్రామీణ ప్రాంతాల్లో భూముల పరస్పర కోనుగోళ్ల మార్పిడికి సంబంధించిన సాదాబైనామాలను ఉచితంగా మ్యుటేషన్ చేయించే ప్రక్రియకు చివరి సారిగా త్వరలో అవకాశం కల్పించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలు ఒకటీ రెండు రోజుల్లో ప్రకటించనున్నట్లు, భవిష్యత్తులో ఇక సాదాబైనామాలకు అనుమతించే ప్రశ్నేలేదని సీఎం తెలిపారు. అయితే ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఇంకా వివాదాలు ఉంటే కోర్టులో తేల్చుకోవాల్సి ఉంటుందని సీఎం వివరించారు.

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉన్న నోటరీ, జీవో 58, 59 పరిధిలోని పేదల ఇండ్లను ఉచితంగా క్రమబద్దీకరించనున్నట్లు సీఎం తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు ఒకటీ రెండు రోజుల్లో జీవో ద్వారా వెల్లడించనున్నట్లు సీఎం వివరించారు. రెవెన్యూ చట్టం అమలు, ధరణి పోర్టల్ రూపకల్పన, వ్యవసాయేతర ఆస్తుల ఆన్ లైన్ నమోదు, నోటరీ, జీవో 58, 59 ఆస్తుల ఉచిత క్రమబద్దీకరణ తదితర అంశాలపై గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని మున్సిపల్ కార్పోరేషన్ల పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్లతో సమావేశం ప్రగతిభవన్ లో జరుగుతుంది.

ప్రభుత్వం ఇక నుండి విడుదల చేసే అన్ని జీవోలు, సర్క్యులర్లు తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో విడుదల చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. ప్రజలకు సమాచారం సౌలభ్యంగా ఉండేలా అధికారులు వ్యవహరించాలని సీఎం సూచించారు.

- Advertisement -