లేడి కిలాడి..శిల్పా చౌదరీ అరెస్ట్

133
khiladi
- Advertisement -

శిల్పా చౌద‌రీ మ‌హా కిలాడి. మాయ‌మాట‌లు చెప్పి కోటీశ్వ‌రుల‌ను ఈజీగా మోసం చేస్తోంది. కిట్టి పార్టీల పేరుతో పెద్దోళ్ల‌తో ప‌రిచ‌యాలు పెంచుకుని అంద‌ర్నీ చీట్ చేస్తోంది. పార్టీల్లో ప‌రిచ‌య‌మైన వారి నుంచి కోట్లాది రూపాయ‌ల‌ను వ‌సూల్ చేసి ఆ త‌ర్వాత క‌నిపించ‌కుండా తిరుగుతోంది. ఈ కేసులో సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన శిల్పా చౌద‌రీని శ‌నివారం పోలీసులు అరెస్టు చేశారు. శిల్పా చౌదరిని శనివారం సైబరాబాద్ కమిషనరేట్ నార్సింగి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నార్సింగ్‌ మున్సిపాలిటీ గండిపేట సిగ్నేచర్ విల్లా లో నివాసముంటున్న చౌదరి అనే మహిళ గత కొన్నాళ్లుగా గండిపేట, కోకాపేట, మణికొండ, పుప్పాలగూడ, జూబ్లీహిల్స్, విజయవాడ, కర్నూలు, ఇతర ప్రాంతాలకు చెందిన సంపన్న కుటుంబాల్లోని మహిళలతో కిట్టి పార్టీల ఏర్పాటు చేసింది. అక్కడికి వారిని ఆహ్వానించి వారితో పరిచయం ఏర్పాటు చేసుకుని తాను సినీ ఫీల్డ్ లో ప్రొడ్యూసర్ నంటూ నమ్మబలికి వారి నుంచి విరివిగా ఒక్కొక్కరి వద్ద కోటి రూపాయల నుంచి ఐదు కోట్ల వరకు డబ్బులు తీసుకొని గత కొన్ని రోజులుగా తప్పించుకు తిరుగుతోంది.

శిల్పా చౌదరి వ్యవహారాన్ని గుర్తించిన రోహిణి అనే మహిళా బాధితురాలు తాను నాలుగు కోట్ల రూపాయలను శిల్పా చౌదరి కి ఇచ్చి మోసపోయానని శనివారం నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. మంచిరేవులోని ఓ విల్లాలో తాను నివాసం ఉంటున్నట్లు బాధితురాలు రోహిణి తెలిపారు. త‌న‌తో పాటు అనేక మంది వద్ద శిల్పా చౌదరి దాదాపు వంద కోట్లపై చిలుకు డబ్బులు తీసుకుని మోసం చేసిన‌ట్లు త‌న‌కుకు తెలిసిందని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నార్సింగి పోలీసులు గండి పేట లోని సిగ్నేచర్ అపార్ట్మెంట్ కు వెళ్లి శిల్పాను అరెస్టు చేశారు. చీటింగ్ కేసులో విచారణ జరుపుతున్నామని ఇన్స్పెక్టర్ శివ కుమార్ తెలిపారు. నార్సింగి పోలీస్ స్టేషన్ కు బాధితులు తరలి వస్తున్నారని వారి వద్ద నుంచి వివరాలు సేకరించి మరింత సమాచారాన్ని తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

- Advertisement -