బస్తీ ధవాఖనాను అకస్మికంగా తనీఖీ చేసిన కేటీఆర్‌..

195
KTR
- Advertisement -

హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసి నిర్వహిస్తున్న బస్తీ ధవాఖనా పనితీరును పరిశీలించేందుకు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ఈరోజు ఆకస్మిక తనిఖీ చేపట్టారు. బేగంపేటలో ఉన్న శ్యామ్ లాల్ బిల్డింగ్ బస్తీ ధవాఖనాను మంత్రి శనివారం ఉదయం తనిఖీ చేశారు. బస్తీ ధవాఖనాలో ఉన్న వసతులను అక్కడి సిబ్బంది పనితీరును మంత్రి పరిశీలించారు. బస్తీ ధవాఖనాలో ఉన్న డాక్టర్ తోపాటు, ఆమె సహాయక సిబ్బందిని, రోజు వారీగా ఎంత మంది బస్తీ ధవాఖనా సేవలను వినియోగించుకుంటున్నారో కనుక్కున్నారు.

KTR

రోజువారీగా సుమారు ఎంతమంది రోగులు వస్తున్నారు, ఎవరికైనా సీరియస్‌గా ఉంటే ఎక్కడికి పంపిస్తారో తెలుసుకున్నారు. అలాంటి పరిస్ధితుల్లో దగ్గరలోని ప్రాథమిక అరోగ్య కేంద్రాలకు లేదా దగ్గరలోని ప్రభుత్వ అసుపత్రులకు తరలిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న సౌకర్యాలతోపాటు ఇంకా ఏమైనా సౌకర్యాలు కావాల్సి ఉంటే సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ధవాఖనా వైద్యసేవల కోసం విచ్చేసిన రోగులతో మంత్రి మాట్లాడారు.

KTR

బస్తీ ధవాఖనా అందిస్తున్న సేవల పట్ల వారి స్పందనను అడిగి తెలుసుకున్నారు. దవాఖానాలో మందులు ఇస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. నగరంలో మొత్తంగా 1,000 ధవాఖనాలు ఉండాలన్న లక్ష్యంతో జిహెచ్ఎంసి పనిచేస్తున్నదని, అన్ని బస్తీల్లోనూ దవాఖానాలు ఉండేలా ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ధవాఖనాలతో పాటు వివిధ రకాల వైద్య పరీక్షలను ఉచితంగా చేసే డయాగ్నస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

KTR

బస్తీ ధవాఖనా లోను శాంపిల్స్ను తీసుకొని ఆయా డయాగ్నస్టిక్ సెంటర్‌లలో పరీక్షించి నేరుగా రోగుల మొబైల్ ఫోన్ లోకి, లేదా ఈ మెయిల్లోకి పంపించే సదుపాయం కూడా ఉంటుందని తెలిపారు. పేద ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చే ఉద్దేశంతో బస్తీ ధవాఖనా, డయాగ్నస్టిక్ సెంటర్ల లాంటి అనేక వినూత్న కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం చేపడుతుందని ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు.

KTR

బస్తీ ధవాఖనా పని చేస్తున్న తీరు చాలా సంతృప్తిగా ఉందని, ప్రభుత్వం ఇలాంటి ఒక సౌకర్యాన్ని కల్పించడం పట్ల అక్కడి రోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ధవాఖనా పనితీరుని తెలుసుకునేందుకు స్వయంగా మంత్రి సందర్శించడం పట్ల మంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. మంత్రి వెంట జియచ్ యంసి అడిషనల్ కమీషనర్ సిక్తా పట్నాయక్ ఉన్నారు.

- Advertisement -