కీలక సూత్రధారి బండి సంజయ్‌: సీపీ రంగనాథ్‌

48
- Advertisement -

పదవ తరగతి ప్రశ్నపత్రాలు లీకేజీ వ్యవహరంలో ఏ1గా బండి సంజయ్‌ అని వరంగల్ సీపీ రంగనాథ్‌ అన్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ ఈ వ్యవహరంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఇందుకుగాను ప్రశాంత్ అనే జర్నలిస్ట్‌ కూడా కీలక పాత్ర పోషించారన్నారు. ఇందులో భాగంగా కమాలాపూర్‌ హైస్కూల్‌ నుంచి ఈ ప్రశ్నపత్రం లీకేజీ జరిగినట్టుగా గుర్తించామని తెలిపారు.

వ‌రంగ‌ల్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో 166 సెంట‌ర్లు ఉన్నాయి. 94 సెంట‌ర్ల‌లో ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయి. ఈ సెంట‌ర్ల‌కు ఇద్ద‌రు కానిస్టేబుల్స్ చొప్పున కేటాయించినా కూడా 500 మంది పోలీసుల దాకా అవ‌స‌రం ప‌డుతారని అన్నారు. ఫ్ల‌యింగ్ స్వ్కాడ్స్‌కు పోలీసులు ప్రొటెక్ష‌న్ ఇవ్వాలి. మాకు ఇత‌ర స‌మ‌స్య‌లు కూడా ఉంటాయి. కాబ‌ట్టి ఒక‌రిద్ద‌రి చొప్పున కేటాయించామని తెలిపారు.

లీకేజీకి ముందురోజు బండి సంజయ్‌, ప్రశాంత్‌కు మధ్య ఫోన్‌ సంభాషణలు జరిగాయని, ఈటల రాజేందర్‌, మరెవరితోనూ మాట్లాడలేదని సీపీ తెలిపారు. దీన్ని విస్తృతంగా లీకేజీతో ఆందోళనకర పరిస్థితులు తీసుకువచ్చేందుకు గేమ్‌ప్లాన్‌ జరిగినట్లుగా విచారణలో తేలిందన్నారు. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌లో బండి సంజ‌య్‌ను ఏ1గా చేర్చారు. ఏ2గా ప్ర‌శాంత్, ఏ3గా మ‌హేశ్‌, ఏ4గా మైన‌ర్ బాలుడు, ఏ5గా మోతం శివ‌గ‌ణేశ్‌, ఏ6గా పోగు సురేశ్‌, ఏ7గా పోగు శ‌శాంక్, ఏ8గా దూలం శ్రీకాంత్, ఏ9గా పెరుమాండ్ల శార్మిక్, ఏ10గా పోత‌బోయిన వ‌సంత్ పేర్ల‌ను చేర్చారు. సంజ‌య్‌పై క‌మ‌లాపూర్ పోలీసులు తెలంగాణ ప‌బ్లిక్ ఎగ్జామినేష‌న్స్ యాక్ట్‌, 1997 లోని సెక్ష‌న్ 5 కింద కేసు న‌మోదు చేశారు. ఐపీసీ సెక్ష‌న్ 120 బీ, సెక్ష‌న్ 420 కింద కూడా పోలీసులు కేసు న‌మోదు చేశారు.

బండి సంజయ్‌ ఫోన్‌ డేటా లభిస్తే మరింత సమాచారం తెలిసేదన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని వారెంట్‌ లేకుండా ఎలా అరెస్ట్‌ చేస్తారని ప్రశ్నిస్తున్నారని సీపీ పేర్కొన్నారు. సెక్షన్‌ 41 సీఆర్‌పీసీ ప్రకారం వారెంట్‌ లేకపోయినా అరెస్ట్‌ చేయవచ్చన్నారు. 41ఏ సీఆర్‌పీసీలో అరుణేశ్ కుమార్‌ స్టేట్‌ ఆఫ్‌ బిహార్‌ కేసులో 2014లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. అందుకే బండి సంజయ్‌పై 120బీ, 420, 447, 505, అలాగే ఐటీయాక్ట్‌ కింద సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని స్పష్టం చేశారు. చట్టానికి లోబడి చర్యలు తీసుకున్నామని స్పష్టత ఇచ్చారు.

పలు కేసుల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ నేతలను అరెస్టు చేశామని.. వరంగల్‌లో ఎక్కువగా అరెస్టయ్యింది బీఆర్‌ఎస్‌ పార్టీ వాళ్లేనన్నారు. ఎవరినీ వేధించేందుకు అరెస్ట్‌ చేయలేదని స్పష్టం చేశారు. బండి సంజయ్‌ మార్గదర్శకత్వంలోనే లీకేజీ జరిగిందని, ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్లి పరీక్ష రద్దు చేయడం లేదంటే.. అభద్రతాభావాన్ని పెంచే దురుద్దేశం ఈ వ్యవహారంలో స్పష్టంగా విచారణలో కనిపించిందని సీపీ వివరించారు.

ఇవి కూడా చదవండి…

TELANGANA:అదంతా.. బండి సంజయ్ కుట్ర!

పవన్ ఇరకాటంలో పడుతున్నాడా ?

కేసీ‌ఆర్ తో డిబేట్ చేసే సత్తా బీజేపీకి ఉందా ?

- Advertisement -