విషమించిన కరుణానిధి ఆరోగ్యం …

304
- Advertisement -

డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి (94) ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉంది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత హుటాహుటిన నగరంలోని కావేరి ఆసుపత్రికి తరలించారు. మూత్రాశయ నాళానికి ఇన్ఫెక్షన్‌, తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయన‌్ను ఆపత్రిలో చేర్చారు. వయోభారంతో తలెత్తిన వ్యాధుల కారణంగా ఏడాదిన్నరగా ఇంటికే పరిమితమయ్యారు. వైద్యులు ఆయనకు ట్రకోస్టమీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

ఆయనకు చికిత్స అందిస్తున్న కావేరీ ఆస్పత్రి నుంచి శుక్రవారం ఎలాంటి హెల్త్‌-బులెటిన్‌ వెలువడకపోవడంతో డీఎంకే శ్రేణులు తీవ్ర ఆవేదన చెందాయి. అయితే కరుణానిధి ఆరోగ్యం మెరుగుపడుతోందని, జ్వరం తగ్గిందని డీఎంకే నేతలు స్టాలిన్‌, దురైమురుగన్‌, అళగిరి తదితరులు ప్రకటించారు. వదంతులు నమ్మవద్దని పార్టీశ్రేణులకు భరోసానిస్తూ వచ్చారు. తాను నవ్వుతున్నానని, దీన్నిబట్టి కరుణానిధి ఆరోగ్యం బాగుందని విశ్వసించాలని దురైమురుగన్‌ విలేకరుల సమావేశంలో అన్నారు.

Kalaignar Karunanidhi serious!

కానీ కరుణానిధి ఆరోగ్య పరిస్థితి విషమించిందని, మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించామని తమిళనాడు ముఖ్యమంత్రి వ్యక్తిగత వైద్యులు డాక్టర్‌ గోపాల్‌ తెలిపారు. కరుణానిధి ఆరోగ్యం విషమంగా ఉందని, రక్తపోటు పడిపోయిందని ఆయన వివరించారు. ఆయన్ను ఐసీయూలో చేర్చుతున్నామన్నారు.

కరుణానిధి చికిత్సకు అవసరమైన ఏ సహాయమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు స్టాలిన్‌కు ప్రధాన మంత్రి మోదీ హామీనిచ్చారు. శుక్రవారం స్టాలిన్‌కు ఫోన్‌ చేసి, ఓదార్చారు. కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నేరుగా స్టాలిన్‌కు, రాజ్యసభ సభ్యురాలు కనిమొళికి ఫోన్‌ చేసి కరుణానిధి ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. శనివారం ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, పలువురు కేంద్ర మంత్రులు చెన్నైకి రానున్నారు.

- Advertisement -