ఏప్రిల్ 16 నుండి 18 వరకు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో జనతాదళ్ యునైటెడ్ (JD-U) తమ పార్టీ ఎంపీలకు ‘త్రీ-లైన్ విప్’ జారీ చేసింది. లోక్సభ మరియు రాజ్యసభలోని సభ్యులందరూ ఈ మూడు రోజుల పాటు తప్పనిసరిగా సభకు హాజరుకావాలని పార్టీ ఆదేశించింది.
నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)లో భాగస్వామిగా ఉన్న జేడీయూకు ప్రస్తుతం లోక్సభలో 12 మంది, రాజ్యసభలో నలుగురు ఎంపీలు ఉన్నారు. సభలో చర్చకు వచ్చే కీలక బిల్లుల సమయంలో సభ్యులందరూ అందుబాటులో ఉండాలని పార్టీ స్పష్టం చేసింది.
ఈ మూడు రోజుల ప్రత్యేక సమావేశాల్లో ప్రభుత్వం ప్రధానంగా ‘నారీ శక్తి వందన్ అధినియం’ (మహిళా రిజర్వేషన్ బిల్లు) అమలును వేగవంతం చేసేందుకు కీలక సవరణలను తీసుకురానుంది.లోక్సభ మరియు రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశ్యం.
2023లో ఆమోదించిన అసలు చట్టం ప్రకారం.. కొత్త జనాభా గణన మరియు నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) తర్వాతే రిజర్వేషన్లు అమలు కావాల్సి ఉంది.అయితే, జనాభా గణనలో జాప్యం జరుగుతున్నందున, 2011 జనాభా లెక్కల ఆధారంగానే పునర్విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ప్రభుత్వం ప్రతిపాదించనున్న సవరణల వల్ల లోక్సభ సీట్ల సంఖ్య ప్రస్తుతం ఉన్న 543 నుండి సుమారు 816కి పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఇందులో దాదాపు మూడో వంతు స్థానాలను మహిళలకు కేటాయించనున్నారు. జేడీయూ కంటే ముందే భారతీయ జనతా పార్టీ (BJP) కూడా తమ ఎంపీలందరికీ త్రీ-లైన్ విప్ జారీ చేసింది. కేంద్ర మంత్రులు, ఎంపీలు ఎవరూ సెలవు తీసుకోకూడదని, ఏప్రిల్ 16 నుంచి 18 వరకు సభలోనే ఉండాలని ఆదేశించింది.
మరోవైపు, ప్రతిపక్ష పార్టీలు ఈ హడావిడి పునర్విభజన ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. సోనియా గాంధీ వంటి అగ్రనేతలు ఇది రాజ్యాంగంపై దాడి అని విమర్శిస్తుండగా, ప్రభుత్వం మాత్రం చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
Also Read:వరుణ్ తేజ్..’కొరియన్ కనకరాజు’!

