ఏఐఏడీఎంకే ఎమ్మెల్యే మరియప్పన్ కెన్నెడి తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత పై చేసిన వ్యాఖ్యాలు చర్చనీయాంశంగా మారాయి. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత భూమిపై నడయాడిన దైవస్వరూపమని ఏఐఏడీఎంకే ఎమ్మెల్యే మరియప్పన్ కెన్నడీ వ్యాఖ్యానించారు. ‘అమ్మ’ విష్ణువు 11వ అవతారం అని పేర్కొన్నారు.
తమిళనాడు అసెంబ్లీలో గురువారం ప్రసంగించిన ఆయన…. పలుమార్లు జయలలితను విష్ణువు అవతారం అంటూ వ్యాఖ్యానించారు. దీంతో అమ్మపై మరియప్పన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. వెంటనే ఈ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని వాటిని రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ ఆదేశించారు.
తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం కోసం పన్నీర్ సెల్వం, పళని స్వామి వర్గాల కుమ్ములాటలతో ఏఐఏడీఎంకే ఇప్పటికే తీవ్రంగా సతమతవుతుండగా… తాజాగా జయలలితపై సదరు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీని మరింత ఇరకాటంలో నెడుతున్నాయి. ఏఐఏడీఎంకే పార్టీ ఎన్నికల గుర్తు ‘రెండు ఆకుల’ కోసం పన్నీర్, పళని వర్గాలు ఎన్నికల సంఘానికి అఫిడవిట్లు దాఖలు చేసిన మరుసటి రోజే మరియప్పన్ ఇలా వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది.