ఈ వారం బయటకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, ఒక గొడుగు వెంట తీసుకెళ్లడం మంచిది. దేశంలోని అనేక ప్రాంతాల్లో రాబోయే రోజుల్లో గాలివానలు, వర్షం, ఇంకా గడ్డివాన కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఈ ప్రభావం అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండదు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం, గాలివానలు పడుతుండగా, పక్కనే ఉన్న ప్రాంతాలు మాత్రం పెద్దగా ప్రభావితం కాకపోవచ్చు. అయినప్పటికీ, అనేక ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉండటంతో అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ఏప్రిల్ 3, 4 తేదీలలో ఒక శక్తివంతమైన వెస్ట్రన్ డిస్టర్బెన్స్ ప్రభావం చూపింది. దాని అవశేషాలు ఇంకా ప్రభావం చూపుతూ, ఢిల్లీ ప్రాంతంలో చల్లని గాలి, మబ్బులు ఏర్పడి వర్షాలు పడ్డాయని తెలిపారు. ఏప్రిల్ 4న గుర్గావ్ పశ్చిమ ప్రాంతంలో బలమైన గాలివాన మేఘాలు ఏర్పడి, తక్కువ సమయంలోనే భారీ వర్షం కురిసింది. ఇలాంటి పరిస్థితులు మళ్లీ కనిపించే అవకాశం ఉంది. అయితే ఇదే సమయంలో ఢిల్లీ NCR ప్రాంతంలో సుమారు 50–60% ప్రాంతం పొడిగా ఉండే అవకాశం కూడా ఉంది.
ఇప్పటి వర్షాలు కేవలం ప్రారంభం మాత్రమే. ఏప్రిల్ 7 నుంచి 9 మధ్య దేశంలో పలు చోట్ల పెద్ద ఎత్తున వర్షాలు పడుతాయని రాజస్థాన్, ఢిల్లీ-NCR, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ, పంజాబ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, బీహార్, ఝార్ఖండ్, ఉత్తర మధ్యప్రదేశ్ మరియు ఈశాన్య భారత ప్రాంతాలను ప్రభావితం చేయనుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇది మొత్తం భారతదేశంలో సుమారు 30–40% ప్రాంతాన్ని కవర్ చేసే అవకాశం ఉంది.
ALso Read;కొత్త కాన్సెప్ట్తో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ!
ఈ రాష్ట్రాల్లో కోతకు సిద్ధంగా ఉన్న గోధుమ పంటలను రైతులు ఏప్రిల్ 6లోపే కోయాలని అత్యవసర సూచనలు చేస్తున్నారు. ముందుగా వచ్చిన వాతావరణ వ్యవస్థ వల్ల ఇప్పటికే భారీ నష్టం జరిగింది. ఏప్రిల్ 3, 4 తేదీలలో రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో గోల్ఫ్ బంతి పరిమాణంలో పడిన గడ్డివాన గోధుమ పంటలను పూర్తిగా నాశనం చేసింది.
ఏప్రిల్ 7 నుంచి 10 మధ్య భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉండటంతో రైతులు తమ పంటలను వెంటనే కోయాలని మరోసారి సూచిస్తున్నారు.

