‘ఒక దేశం, ఒక పన్ను, ఒక మార్కెట్’ నినాదంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమల్లోకి తీసుకువచ్చిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ)పై జమ్మూకశ్మీర్ అసెంబ్లీ అట్టుడికింది. జీఎస్టీకి జమ్మూకశ్మీర్ మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఆమోదముద్ర వేశాయి. మంగళవారంనాడు జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం జమ్మూకశ్మీర్ అసెంబ్లీ సమావేశమైనప్పుడు మంత్రులు దీన్ని అడ్డుకున్నారు. జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి ఉందని మంత్రులు నినాదాలు చేశారు. చివరికి అది వ్యక్తిగత బెదిరింపులకు దారితీసింది. అంతేకాదు జమ్మూకశ్మీర్ అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర మంత్రి ఇమ్రాన్ అన్సారీ ప్రతిపక్ష పార్టీ నేత దేవేందర్ రాణాను సభలోనే చంపి పాతరేస్తానంటూ బెదిరించారు.
దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టిన జీఎస్టీని అమలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే యత్నం చేశారు. తాను పన్నులు ఎగ్గొట్టలేదని, చీకటి వ్యాపారాలు చేయాల్సిన ఖర్మ తనకు పట్టలేదని అధికార పక్ష నేతలకు దేవేందర్ రాణా బదులిచ్చారు. ఓ వైపు ఎమ్మెల్యే రాణా మాట్లాడుతుండగా.. రాష్ట్ర ఐటీ, సాంకేతిక విద్య శాఖలమంత్రి ఇమ్రాన్ అన్సారీ కలుగజేసుకుని ‘నేను తలుచుకుంటే నిన్ను ఇక్కడే చంపేయగలను. నీ దొంగ వ్యాపారాలు నాకు తెలుసు. రాష్ట్రంలో నీ కంటే పెద్ద దొంగ ఎవరూ లేరు. మోబిల్ ఆయిల్ అమ్ముతూ వ్యాపారాలు మొదలుపెట్టావ్. నీకు అన్ని ఆస్తులు ఎక్కడినుంచి వచ్చాయో మాకు తెలియదనుకున్నావా’ అంటూ బెదిరింపు చర్యలకు పాల్పడ్డారు. మంత్రి అన్సారీ వ్యాఖ్యలతో సభలో కాసేపు గందరగోళ పరిస్థితి తలెత్తింది. ఏకంగా అసెంబ్లీలోనే మంత్రి చేసిన తీవ్ర వ్యాఖ్యలు రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ప్రస్తుత రూపంలో జీఎస్టీ అమలు కుదరదంటూ రాష్ట్రంలోని వివిధ వాణిజ్య సంస్థలు, ప్రజా సంఘాలు సోమవారంనాడు ఒక సమన్వయ కమిటీగా ఏర్పడ్డాయి. డజనుకు పైగా కేంద్ర, రాష్ట్ర పన్నులను ఏకీకృతం చేస్తూ జీఎస్టీని ఈనెల 1 నుంచి కేంద్రం అమల్లోకి తీసుకువచ్చింది.