ట్రీ సిటీగా హైదరాబాద్: సీఎం కేసీఆర్‌

100
- Advertisement -

తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఫలితంగా రాష్ట్రంలో పచ్చదనం నాలుగు శాతం పైగా పెరిగిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఈరోజు స్వాంతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం గోల్కొండ కోటలో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ట్రీ సిటీగా హైదరాబాద్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చిందిన్నారు. ప్రపంచంలోని 63 దేశాలలో భారత దేశం నుంచి ఈ ఘన గౌరవాన్ని దక్కించుకున్న ఏకైక నగరం మన హైదరాబాద్ కావడం విశేషమని సీఎం తెలిపారు. ఈ ఘనత ఆషామాషీగా రాలేదు. చెట్లను నాటడంలో, పోషించడంలో, విస్తరించడంలో ప్రభుత్వం నిర్మాణం చేసిన గొప్ప వ్యవస్థ ప్రధాన కారణం. ఫారెస్ట్ సర్వే ఆప్ ఇండియా చేసిన సర్వేలో తెలంగాణలో పచ్చదనం సుమారు నాలుగు శాతం పెరిగినట్టు వెల్లడయింది. కేంద్ర అటవీ శాఖా మంత్రి కూడా నిండు పార్లమెంటులో మొక్కలు నాటడంలో, చెట్లు పెంచడంలో తెలంగాణ అగ్రగామిగా ఉన్నట్టు ప్రకటించారు. ఐక్యరాజ్య సమితి పర్యావరణ నిపుణులు మన ప్రయత్నాలను ప్రశంసించారు. ఇదే స్పూర్తి మరికొంత కాలం సాగాలి.హరిత లక్ష్యం సిద్ధించే వరకూ అందరూ పట్టుబట్టి మొక్కలను నాటాలనీ, శ్రద్ధగా పెంచాలని వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను అని సీఎం తెలిపారు.

అన్ని ప్రాంతాల ప్రజలు సౌకర్యంగా జీవనం గడపటానికి అనువైన నగరంగా కూడా హైదరాబాద్‌కు ఎంతో పేరు వచ్చింది. హైదరాబాద్‌ను విశ్వ నగరంగా తీర్చిదిద్దే క్రమంలో అడుగడుగునా నిర్మించిన ఫ్లై ఓవర్లు, పెరిగిపోతున్న ట్రాఫిక్ కష్టాలను గణనీయంగా తగ్గించాయి. ఇంకా పలు ప్లైఓవర్లు, స్కై ఓవర్లు నిర్మాణదశలో ఉన్నాయి. నగరానికి కొత్త అందాలను చేకూరుస్తూ ఏర్పాటైన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ఆసియాలోనే రెండవ అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిగా రికార్డు సృష్టించిందన్నారు. దుర్గం చెరువు బ్రిడ్జి నగర ప్రజలకు దూరాభారం తగ్గించడమే కాకుండా, సాయంకాలాలు జనం సేదతీరే ఉల్లాస కేంద్రంగా ఉపయోగపడుతున్నది. హైదరాబాద్ నగరం అనంతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న అవుటర్ రింగ్ రోడ్డుకు అదనంగా రీజినల్ రింగ్ రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించిందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

- Advertisement -