తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా హిమ కోహ్లీ నియామకం..

193
Hima Kohli
- Advertisement -

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమ కోహ్లీ నియామకం అయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ చౌహాన్‌ జార్ఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేశారు. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ హిమా కోహ్లీ రికార్డు సృష్టించారు. 1959 సెప్టెంబరు 2న ఢిల్లీలో జన్మించిన జస్టిస్‌ హిమా కోహ్లీ.. అక్కడే ప్రాథమిక విద్య పూర్తి చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎంఏ(హిస్టరీ) చేసిన అనంతరం న్యాయశాస్త్రం చదివారు.

1984లో లా డిగ్రీ పొంది, అదే సంవత్సరం ఢిల్లీ బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నారు. 1999- 2004 మధ్య ఢిల్లీ మునిసిపల్‌ కౌన్సిల్‌కు హైకోర్టులో స్టాండింగ్‌ కౌన్సిల్‌గా, న్యాయ సలహాదారుగా వ్యవహరించారు. ఢిల్లీ హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ సభ్యులుగా చేశారు. 2006 మే 29న ఢిల్లీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులై.. 2007 ఆగస్టు 29న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది మే 20 నుంచి ఢిల్లీ స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా, ఈ ఏడాది జూన్‌ 30 నుంచి నేషనల్‌ లా యూనివర్సిటీ గవర్నింగ్‌ కౌన్సిల్‌ మెంబర్‌గానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

- Advertisement -