మొక్కలు నాటిన హీరో సుధీర్ బాబు..

226
Hero Sudheer babu
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఎంతో మందిలో స్పూర్తి నింపి కొత్త ఆలోచనలకు తెరలేపుతుంది. హీరో నవీన్ కృష్ణ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి ఈ రోజు గండిపేటలోని తన నివాసంలో మొక్కలు నాటారు ప్రముఖ హీరో సుధీర్ బాబు.

ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం మాలో కొత్త ఆలోచనలు తీసుకువస్తోంది అని, ఈ చాలెంజ్ స్వీకరించి ఈరోజు తన నివాసంలో మొక్కలు నాటడం జరిగింది అని, ఈ నాటిన మొక్కకు ప్రత్యేకత ఉందని, నూతనంగా విడుదల అయిన నా V సినిమాకు గుర్తుగా మొక్కలు నాటడం జరిగింది అని తెలిపారు.

ఇకపై నేను ఏ మంచి కార్యక్రమం చేపట్టిన నా నూతన సినిమాలు విడుదలకు ముందు మొక్కను నాటి ఆ మొక్కకు ఆ సినిమా పేరు పెట్టుకుంటాను అని చెప్పారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఏదైనా మంచి కార్యక్రమం చేపడుతున్నపుడు దాని ముందు మొక్కలను నాటి వాటికి పేర్లు పెట్టుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుందని, భవిష్యత్తులో కూడా మా పిల్లలకు కూడా నేను ఇదే నేర్పిస్తాను అని తెలిపారు.

తన పిల్లలు మాత్రమే కాదు, ఇది ఆదర్శంగా తీసుకోని ఎవరైనా సరే, ఎగ్జామ్ లో మంచి మార్కులు తెచ్చుకున్నపుడు, వారు ఉద్యోగం సాధించినప్పుడు మొక్కలు నాటే అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. రోజురోజుకు పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్ కి మా V సినిమా చిత్ర బృందం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, ఇదే విధంగా ఈ ఛాలెంజ్ ముందుకు కొనసాగాలని కోరారు. అందులో భాగంగా మా V సినిమా చిత్రం బృందం ప్రముఖ నిర్మాత దిల్ రాజు,దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ, హీరోయిన్లు నివేదిత థామస్, అదితి రావు లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

తన ప్రతి సినిమా విడుదల సందర్భంగా మొక్క నాటి దానికి ఆ నూతన సినిమా పేరు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్న హీరో సుధీర్ బాబు నిర్ణయానికి రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ అభినందనలు తెలియజేశారు. ఇలాంటి మంచి సందేశాన్ని అందించినందుకు చాలా సంతోషంగా ఉందని, ప్రతి ఒక్కరు కూడా దీన్ని బాధ్యత తీసుకోని ఏ మంచి సందర్భం వచ్చినప్పుడు అయినా మొక్కలు నాటడానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

- Advertisement -