జీఎస్టీ వృద్ధి 0 శాతమా?: హరీష్ రావు

0
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో జీఎస్టీ (GST) వృద్ధి రేటు గణనీయంగా తగ్గడంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 2025 మార్చి నాటికి జీఎస్టీ వృద్ధి రేటు 0%గా నమోదైందని, 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం కేవలం 5.1% వృద్ధి మాత్రమే సాధించినట్లు అధికారిక గణాంకాల ఆధారంగా ఆయన వెల్లడించారు. దేశవ్యాప్తంగా సగటు జీఎస్టీ వృద్ధి రేటు 10% ఉండగా, తెలంగాణ రాష్ట్రం దేశీయ వృద్ధి రేటుతో పోలిస్తే చాలా వెనకబడి ఉందని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా, శాసనసభలో ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గారు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, “జీఎస్టీ వృద్ధి 12.3%గా ఉందని శాసనసభలో ప్రకటించడం శోచనీయం” అని హరీశ్ రావు అన్నారు. అయితే, అధికారిక గణాంకాలను పరిశీలిస్తే, భట్టి గారి వాదనలు పూర్తిగా అవాస్తవమైనవిగా తేలిపోయాయని వారు స్పష్టం చేశారు.

బడ్జెట్ సమావేశాల్లో నేను ఈ విషయాన్ని ప్రస్తావించి, రాష్ట్ర జీఎస్టీ వృద్ధి రేటు 5.5%కు పరిమితమవుతుందని హెచ్చరించాను. మా సలహాలు,హెచ్చరికలను ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ప్రస్తుతం అధికారికంగా తెలంగాణ వృద్ధి రేటు కేవలం 5.1% మాత్రమేనని ధృవీకరించబడిందని చెప్పారు. తెలంగాణలో ఇంత తక్కువ జీఎస్టీ వృద్ధి ఇప్పటివరకు ఎన్నడూ నమోదు కాలేదు, కోవిడ్-19 లాక్‌డౌన్ కాలంలో తప్ప. ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, నిర్లక్ష్యానికి స్పష్టమైన నిదర్శనమని ఆయన అన్నారు.

రాష్ట్ర వృద్ధి రేటు క్రమంగా తగ్గడానికి గత 15 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు కారణమని హరీశ్ రావు గారు పేర్కొన్నారు. “క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాలు అమలులో లోపాలు, రైతు భరోసా ద్వారా పంట పెట్టుబడి సహాయం అందించకపోవడం, రైతు భరోసా పథకం కింద రూ.12,000 కోట్ల నిధులు విడుదల చేయకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చు సామర్థ్యం తగ్గిపోయింది. అలాగే, హైడ్రా, మూసీ ప్రాజెక్టుల వంటి తప్పుడు విధానాలతో భయాందోళనలు సృష్టించి పెట్టుబడులు రాకుండా చేయడం, ఫార్మా సిటీ, మెట్రో రైలు ప్రాజెక్టులను రద్దు చేయడం వల్ల వ్యాపార వాతావరణం దెబ్బతింది” అని ఆయన వివరించారు.

ప్రజల చేతిలో డబ్బు లేకపోతే వినియోగం ఎలా పెరుగుతుంది?

ఆర్థిక మంత్రి శాసనసభను మాత్రమే కాదు, తెలంగాణలోని ప్రతి పౌరుడిని మోసం చేశారు. ఇది సిగ్గుచేటు అని హరీశ్ రావు గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, మోసపూరిత అంకెల గారడీతో మోసం చేయకుండా, వాస్తవాల ఆధారంగా పాలన అందించాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు అని హరీశ్ రావు గారు హితవు పలికారు.

Also Read:బీసీల ఆత్మగౌరవానికి ప్రతీక పూలే: కవిత

- Advertisement -