జమ్మికుంట సీఐకి హరీష్‌ సెల్యూట్…

430
- Advertisement -

పోలీస్ అంటే శాంతి భద్రతలను కాపాడేవాడే కాదు.. ప్రజలు ఆపదలో వుంటే ఆదుకోవాలని నిరూపించాడు కరీంనగర్ జిల్లా జమ్మికుంట సీఐ సృజన్ రెడ్డి. ఆపద్బాంధవ సీఐపై పోలీసులే కాదు యావత్ తెలంగాణ ప్రశంసలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో స్పందించారు మాజీ మంత్రి హరీష్‌రావు.

ప్రజల కోసం ప్రాణాలకు తెగించడం అంటే ఇదే..ఇటువంటి ధైర్యసాహసాలు మొత్తం పోలీసు శాఖకు గౌరవం తీసుకువస్తాయని ట్వీట్ చేశారు హరీశ్. జమ్మికుంట సీఐ సృజన్ రెడ్డి మిమ్మల్ని చూసి పోలీస్ శాఖే కాదు మొత్తం తెలంగాణ సమాజం గర్విస్తోంది. మీ సాహసం మరెందరికో స్పూర్తిగా నిలవాలి మీకు నా సెల్యూట్ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు హరీష్.

harish rao

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లె గ్రామానికి చెందిన మల్లయ్య(45),మారేపల్లి రవీందర్(45) చేపల కోసం మంచినీటి బావిలో దిగారు. కొంతసేపటికే శ్వాస అందకపోవడంతో బావిలో చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు 108తో పాటు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో వెంటనే ఘటనా స్ధలానికి చేరుకున్న సీఐ సృజన్ రెడ్డి తానే స్వయంగా బావిలోకి దిగి ప్రాణాలు కాపాడారు. ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం వారిద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. మల్లయ్య,రవీందర్‌లను కాపాడిన సీఐ సృజన్ రెడ్డికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -