ఇంటర్నేషనల్ క్రికెట్లోకి మళ్లీ రీ-ఎంట్రీ ఇవ్వాలనుకున్న ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఆశలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా తగిలిన తొడ కండరాల గాయం కారణంగా ఆయన కనీసం రెండు వారాల పాటు ఆటకు దూరం కానున్నట్లు వెల్లడైంది.
ఐపీఎల్ 2026 సమయంలో వెన్నునొప్పి నుండి కోలుకున్న పాండ్యా, ఫిట్నెస్ క్లియరెన్స్ కోసం ఈ నెల ప్రారంభంలో బెంగళూరులోని బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) కు వెళ్లాడు. అక్కడ పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు నివేదికలు రావడంతో.. ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే మూడు వన్డేల సిరీస్లో ఆడేందుకు అతనికి మొదట అనుమతి లభించింది. కానీ, ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఆయన మళ్లీ గాయపడటం గమనార్హం.
ఈ తాజా గాయం కారణంగా 32 ఏళ్ల హార్దిక్ పాండ్యా ఈ సిరీస్లో ఆడే అవకాశం ఎంతమాత్రం లేదు . గాయం నుండి కోలుకోవడానికి కనీసం మూడు వారాల సమయం పడుతుంది, కాబట్టి ఈ వన్డే సిరీస్లో అతను ఆడే ఛాన్స్ అస్సలు లేదు. ఎందుకంటే అప్పటికి అతని పునరావాస ప్రక్రియ పూర్తి కాదు అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
హార్దిక్ పాండ్యాను ప్రస్తుతం ఎలాంటి ఒత్తిడితో కూడిన పనులు చేయవద్దని, బరువులు ఎత్తవద్దని వైద్య బృందం సలహా ఇచ్చింది. ఆయన ధర్మశాలలో ఉన్న భారత జట్టుతో కలవకుండా, బెంగళూరులోని CoE లోనే ఉంటూ తన రిహాబిలిటేషన్ను కొనసాగిస్తాడు. చివరి నిమిషంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పాండ్యా కాలికి స్వల్పంగా నరాలు పట్టేయడం వల్ల తీవ్రమైన నొప్పి ఉంది. ఇదేమీ దీర్ఘకాలిక సమస్య కాదు, కానీ కొన్ని రోజుల పాటు కాలిపై ఎక్కువ ఒత్తిడి పడకుండా చూసుకోవాలని వైద్య సిబ్బంది సూచించారు. హార్దిక్ బెంగళూరులోనే ఉంటూ CoE ఫిజియోలు, ట్రైనర్ల పర్యవేక్షణలో కోలుకుంటాడు అని బీసీసీఐ ప్రతినిధి వెల్లడించారు.
Also Read:ఆసియా టెక్ షేర్లుపతనం..కారణమిదే!
2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్పై భారత్ విజయం సాధించిన మ్యాచ్లోనే హార్దిక్ పాండ్యా చివరిసారిగా వన్డే మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా (అవే సిరీస్), సౌతాఫ్రికా, మరియు న్యూజిలాండ్ (సొంతగడ్డపై) లతో జరిగిన మూడు వన్డే సిరీస్లకు దూరమయ్యాడు.

