15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్‌!

3
- Advertisement -

15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించడాన్ని నిషేధిస్తూ ఫ్రాన్స్ ఒక చారిత్రాత్మక చట్టాన్ని ఆమోదించింది. ఇటువంటి కఠినమైన నిబంధనలను ఆమోదించిన తొలి యూరోపియన్ యూనియన్ (EU) దేశంగా నిలిచింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మద్దతు తెలిపిన ఈ చట్టం.. పిల్లలను ఆన్‌లైన్‌లోని హానికరమైన కంటెంట్ మరియు మానసిక ఆరోగ్య సమస్యల నుంచి రక్షించడమే లక్ష్యంగా తెచ్చారు.

ఈ బిల్లు హైస్కూళ్లలో మొబైల్ ఫోన్ల వాడకాన్ని కూడా నిషేధిస్తుంది.అయితే ఆన్‌లైన్ ఎన్‌సైక్లోపీడియాలు, విద్యా సంబంధిత లేదా శాస్త్రీయ సమాచారాన్ని అందించే సైట్లకు ఈ నిషేధం వర్తించదు.ఈ కొత్త చట్టం సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యే నూతన విద్యా సంవత్సరం (అకడమిక్ ఇయర్) నుంచి అమలులోకి రానుంది.

15 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించకుండా నిషేధిస్తూ ఫ్రాన్స్ ఒక కీలక చట్టానికి ఆమోదం తెలిపింది. యూరోపియన్ యూనియన్‌లో ఇలాంటి సమగ్ర నిషేధాన్ని తీసుకొచ్చిన మొదటి దేశం ఫ్రాన్సే. మంగళవారం ఫ్రాన్స్ పార్లమెంట్‌లోని రెండు సభలు ఆమోదించిన ఈ బిల్లు, వచ్చే ఏడాది పదవీకాలం ముగియనున్న అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తీసుకొచ్చిన ప్రధాన విధానపరమైన నిర్ణయాలలో ఒకటిగా నిలవనుంది.

పిల్లలు, టీనేజర్లు మితిమీరి సోషల్ మీడియాను ఉపయోగించడం వల్ల వారి మానసిక ఆరోగ్యం దెబ్బతినడం, ఆన్‌లైన్ భద్రత లోపించడం మరియు హానికరమైన డిజిటల్ కంటెంట్‌కు గురికావడంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో ఈ చట్టం వచ్చింది. సోషల్ మీడియా ఆంక్షలతో పాటు, ఫ్రెంచ్ హైస్కూళ్లలో మొబైల్ ఫోన్ల వాడకాన్ని కూడా ఈ చట్టం నిషేధిస్తుంది. సెప్టెంబర్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే ఈ చట్టాన్ని అమలులోకి తేవాలని మాక్రాన్ భావిస్తున్నారు. అయితే, అమలు చేయడానికి ముందు ఈ చట్టం రాజ్యాంగ సమీక్షకు గురయ్యే అవకాశం ఉంది. చట్టపరమైన అభ్యంతరాలు వ్యక్తమైతే అమలు ప్రక్రియ కాస్త ఆలస్యం కావచ్చు.

ఈ కొత్త చట్టానికి తల్లిదండ్రులు, పిల్లల హక్కుల పరిరక్షణ సంస్థల నుంచి విశేష మద్దతు లభించింది. మైనర్లను ఆన్‌లైన్ ప్రమాదాల నుంచి రక్షించడంలో ప్రస్తుతమున్న రక్షణ చర్యలు సరిపోవని వారు చాలా కాలంగా వాదిస్తున్నారు. “మేము మొదటి నుంచీ ఈ బిల్లు కోసం ఉద్యమిస్తున్నాం. ఎందుకంటే బడా టెక్ కంపెనీలను అడ్డుకోవడానికి మా వద్ద వేరే దారి లేదు. మద్యం తాగకుండా మన పిల్లలను ఎలాగైతే కాపాడుకుంటామో, ఆన్‌లైన్ ప్రమాదాల నుంచి కూడా అలాగే కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని పారిస్ ప్రాంతానికి చెందిన 52 ఏళ్ల గాయెల్ బెర్బోండే తెలిపారు.

15 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను యాక్సెస్ చేయకుండా ఈ చట్టం నిషేధిస్తుంది. దీంతో పాటు హైస్కూళ్లలో విద్యార్థులు మొబైల్ ఫోన్లు వాడకూడదని స్పష్టం చేసింది. అయితే, విద్యార్థుల చదువుకు ఇబ్బంది కలగకుండా ఆన్‌లైన్ ఎన్‌సైక్లోపీడియాలు, విద్యా సంబంధిత ప్లాట్‌ఫామ్‌లు లేదా శాస్త్రీయ సమాచారాన్ని అందించే సైట్లకు ఈ నిషేధం నుంచి మినహాయింపు ఇచ్చారు.

పార్లమెంట్ బిల్లును ఆమోదించినప్పటికీ దీన్ని ప్రాక్టికల్‌గా అమలు చేయడం సవాలుతో కూడుకున్నదని నిపుణులు అంటున్నారు. ఆన్‌లైన్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ (e-Enfance) న్యాయ సలహాదారు ఇనెస్ లెజెండ్రే మాట్లాడుతూ.. చట్టం ఆమోదం పొందినంత మాత్రాన వెంటనే నిషేధం అమల్లోకి రాదని పేర్కొన్నారు.

Also Read:ఢిల్లీ హైకోర్టు తీర్పుపై సోనమ్ భార్య

స్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియా ప్రభావం టీనేజర్లపై దారుణంగా పడుతోందని ఫ్రాన్స్ హెల్త్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రతి ఇద్దరు టీనేజర్లలో ఒకరు రోజుకు 2 నుంచి 5 గంటల సమయాన్ని స్మార్ట్‌ఫోన్‌లోనే గడుపుతున్నారు.12 నుంచి 17 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలలో 90 శాతం మంది ప్రతిరోజూ స్మార్ట్‌ఫోన్ ద్వారా ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారు.అందులో 58 శాతం మంది ప్రధానంగా సోషల్ నెట్‌వర్కింగ్ కోసమే ఫోన్లను వాడుతున్నారు.సుదీర్ఘకాలం సోషల్ మీడియాను ఉపయోగించడం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం తగ్గడం, మాదకద్రవ్యాల వినియోగం, ఆత్మహత్య వంటి ప్రమాదకరమైన ప్రవర్తనలకు లోనవుతున్నారని హెల్త్ వాచ్‌డాగ్ హెచ్చరించింది.

- Advertisement -