తెలంగాణ కాంగ్రెస్ లో ముఖ్య నేతలు పార్టీకి రాజీనామాలు చేస్తోన్నారు. మొన్న మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి రాజీనామా చేయగా నిన్న గ్రేటర్ హైదరాబాద్ మాజీ ఇంఛార్జ్, కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్ కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తోన్న అభివృద్ది పథకాలు చూసి కీలక నేతలు టీఆర్ ఎస్ పార్టీలో చేరుతోన్నారు. కాంగ్రెస్ పార్టీలో నాయకులకు సరైన గౌరవం దక్కకపోవడంతోనే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు పలువురు నేతలు తెలిపారు.
తాను పార్టీ మారడానికి గల కారణాలను మీడియాకు చెప్పారు దానం నాగేందర్. ముఖ్యంగా పార్టీలో బీసీలకు సరైన గౌరవం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ భవన్ లో ఏ కార్యక్రమం జరిగినా వేదికపై ఎవరు ఉంటున్నారో ఒక్కసారి చూస్తే అర్ధమైపోతుందన్నారు. బీసీల సమస్యలపై రాహుల్ గాంధీకి చాలా సార్లు వివరించానన్నారు. కాంగ్రెస్ లో బీసీ నేతలైన కేకే, డి శ్రీనివాస్ లు పార్టీకి ఎందుకు వీడారో తాను రాహుల్ గాంధీకి వివరించానని తెలిపారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్యయ్య పార్టీలో సరైన గౌరవం ఇవ్వడం లేదన్నారు. వరంగల్ జిల్లాలో బహిరంగ సభ పెడితే పొన్నాలను ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత బడుగు, బలహీన వర్గాల అభివృద్దికి కృషి చేస్తోన్న నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బీసీలను రాజ్యసభకు పంపించిన ఘనత కేసీఆర్ ది అన్నారు. ఈసందర్భంగా ఆయన నేడు కేసీఆర్ సమక్షంలో మధ్యాహ్నం సీఎం అధికారిక భవనం ప్రగతి భవన్ లో టీఆర్ ఎస్ కండువా కప్పుకోనున్నారు. దానం నాగేందర్ తో పాటు అతని అనుచరులు భారీ సంఖ్యలో టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. టీఆర్ఎస్ పార్టీలో తనకు ఏ పదవి ఇవ్వకపోయినా సామాన్య కార్యకర్తగా పనిచేస్తానని తెలిపారు. మొత్తం మీద తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే సినీయర్ నేతలు పార్టీని వీడుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక దానం టీఆర్ ఎస్ లో చేరడం వల్ల హైదరాబాద్ లో పార్టీకి మరింత బలం చేకూరనుంది.