Congress:ఒంటరవుతున్న ‘హస్తం పార్టీ’?

13
- Advertisement -

లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇండియా కూటమిలో విభేదాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమికి ఆదిలోని అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వైఖరి నచ్చక ఇతర పార్టీలు ఇండియా కూటమి నుంచి బయటకు వస్తుండడం హస్తం నేతలను కలవర పెడుతున్న అంశం. పంజాబ్ లో ఆప్ ఎలాంటి పొత్తు లేకుండా 13 లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మన్ ఇటీవల చెప్పుకొచ్చారు. అలాగే పశ్చిమ బెంగాల్ లో కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒంటరి పోరు చేస్తుందని మమతా బెనర్జీ ఇటీవల క్లారిటీ ఇచ్చారు. దీంతో అటు కేజ్రీవాల్ గాని, ఇటు మమతా బెనర్జీ గాని పొత్తు ఇండియా కూటమి గురించి ప్రస్తావించకుండా ఏకపక్షంగా పోటీకి సై అనడంతో టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చినట్లేనని చెబుతున్నారు కొందరు..

ఇకపోతే కూటమి ఏర్పడిన మొదటి నుంచి ప్రతి సమావేశంలో కూడా కొంతమంది కీలక నేతలు విముఖత చూపుతూ వస్తున్నారు. నితీశ్ కుమార్, కేజ్రీవాల్, మమతా బెనర్జీ.. ఇలా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. దీంతో ఎన్నికల ముందు కూటమి బీటలు వారే అవకాశాలు గట్టిగానే కనిపిస్తున్నాయి. వచ్చే నెలలో లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సరిగ్గా ఎన్నికల ముందు ఎవరికి వారే అన్నట్లుగా కూటమిలో పరిస్థితి మారిపోవడంతో కాంగ్రెస్ నెక్స్ట్ ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది. సీట్ల విషయంలో కాంగ్రెస్ వెనక్కి తగ్గకపోతే ఇతర పార్టీలన్నీ కూడా ఏకపక్షంగా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆ లెక్కన చూస్తే కూటమిలో చీలిక ఏర్పడి హస్తం పార్టీకి ఒంటరి పోరు తప్పదనే అభిప్రాయాలూ కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Also Read:Harishrao:కాంగ్రెస్,బీజేపీ రహస్య మైత్రి

- Advertisement -