దేశంలో ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో అందరికీ తెలసిందే.. అయితే, ఎప్పటి నుండో ఆధార్లో పలు రకాల తప్పులు చోటు చేసుకుంటున్నాయంటూ వాదన వినిపిస్తుంది. వీటి సరిచేయించుకునేందుకు ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలు, మీ సేవా,ఈ సేవా కేంద్రాల చూట్టూ చక్కర్లు కొట్టాల్సివస్తోంది. ఈ నేపథ్యంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్లో మార్పులకు సంబంధించిన సేవలను ఇంటివద్దనే అందించేలా యూఐడీఏఐ చర్యలు తీసుకుంటోంది.

దీని కోసం సుమారు 48 వేల మంది పోస్టల్ ఉద్యోగులకు శిక్షణ ఇస్తోంది. ఈ 12 అంకెల ఆధార్ నెంబర్ను యూఐడీఏఐనే జారీ చేస్తోంది. వీటి సేవలకు సంబంధించి నిర్ణయాలను కూడా ఈ సంస్థే తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాలకు కూడా ఆధార్ సర్వీసులను తీసుకెళ్లేందుకు ప్రస్తుతం యూఐడీఏఐ సంస్థ ప్రయత్నిస్తోంది.
వారికి ఆధార్ కిట్తో కూడిన డెస్క్ టాప్, ల్యాప్ టాప్ లను అందిస్తోంది. ఆధార్తో మొబైల్ ఫోన్ నెంబరు అనుసంధానం చేయడం, ఇతర వివరాలు అప్ డేట్ చేయడం, బాలల వివరాలను ఆధార్లో నమోదు చేయడం వంటి విధులను వీరికి కేటాయించనున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా పోస్ట్ మేన్ లకు 13 వేల మంది బ్యాంకింగ్ ప్రతినిధులు కూడా సహకరిస్తారు. పోస్ట్ మేన్లు సేకరించిన వివరాలను వీరు అప్ డేట్ చేస్తారు. వారికి పూర్తి తరహాలో శిక్షణను కూడా యూఐడీఏఐ అందిస్తోంది.

