కాంగ్రెస్‌వి క‌ల్ల‌బొల్లి మాట‌లు.. బీజేపీవి జూటా మాట‌లు..

74
Minister Errabelli
- Advertisement -

ఈ నెల 3వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజుల పాటు నిర్వహిస్తున్న 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీస‌ర‌లో రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రా రెడ్డి, పంచాయితీ రాజ్ కమిషనర్ శరత్, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మండల కేంద్రం, కీస‌ర‌లో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేశారు. అంబేద్క‌ర్ విగ్ర‌హానికి పూల మాల వేసి నివాళుల‌ర్పించారు. గ్రామీణ క్రీడా ప్రాంగ‌ణాన్ని ప్రారంభించారు. మ‌హిళా ప్ర‌జాప్ర‌తినిధుల‌తో కబ‌డ్డీ ఆడారు. అనంత‌రం మంత్రులు స‌భ‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు. కాంగ్రెస్ వి క‌ల్ల‌బొల్లి మాట‌లు, బిజెపి వి జూటా మాట‌లు. చెప్పేది ఎక్కువ‌. చేసేది త‌క్కువ‌.రూపాయి నెత్తి మీద పెడితే, పావులాకు అమ్ముడుపోని బాప‌తు.అందుకే వాళ్ళ‌కు నోటికి వ‌చ్చినట్లు మాట్లాడ‌తారు. వాళ్ళ మాట‌లు న‌మ్మొద్దు. మేం కూడా చేసింది చెబుతున్నాం. ఎవ‌రంటేనేది మనం విశ్లేషించుకోవాలి. ఎవ‌రేం చేస్తున్నారో ఆలోచించుకోవాలి అన్నారు.

పెన్షన్లు 4వేలు ఇస్తామని ఒకడు అంటున్నాడు. సిగ్గు లేదు… మీ పార్టీలు పాలించే రాష్ట్రాల్లో మీరు ఎంత ఇస్తున్నారు? రూ.500 కూడా ఇవ్వడం లేదు. మరి ఇక్కడ ఎట్లిస్తారు? చెప్పాలి. ప్రధాని మోడీ రాష్ట్రం గుజ‌రాత్‌లో కూడా మనం ఇచ్చేంత పెన్ష‌న్ ఇవ్వ‌డం లేదు. వీళ్ళు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు అని మంత్రి మడిపడ్డారు. కరోనా కష్ట కాలంలోనూ పెన్షన్లు ఆప‌లేదు. త్వరనే 57 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కొత్త పెన్షన్లు ఇస్తామ‌ని మంత్రి వివ‌రించారు. ఎవరు కరెక్ట్ అనేది తెలుసుకోవాలి. కల్లబొల్లి కబుర్లు చెప్పే వాళ్ళను నిలదీయాలి. వాళ్ళ నిగ్గు తేల్చాలి. ఊరుకో చెగుడు ఉంటాడు. అలాంటి వాళ్ళ‌ని అదుపు చేయాల్సిన బాధ్య‌త‌ని ప్ర‌జ‌లే తీసుకోవాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి పిలుపునిచ్చారు.

తెలంగాణ రాష్ట్రం…కెసిఆర్ వచ్చిన తర్వాతే అభివృద్ధి మొదలైంది. ఇప్పుడు ప‌ల్లె ప్ర‌గ‌తి వ‌చ్చింది. గ్రామాలు బాగా అభివృద్ధి చెందుతున్నాయి. అనేక సదుపాయాలు కలుగుతున్నాయి. ప‌ల్లెలు ప‌చ్చ‌గా మారుతున్నాయి. రైతులుకు సాగు నీరు అంది వ్య‌వ‌సాయం ప‌చ్చ‌గా సాగుతున్న‌ది. రాష్ట్రం ఈ తీరుగ బాగుప‌డ‌టం ప్రతిపక్షాలకు గిట్టడం లేదు. అందుకే లేనిపోని ఆరోప‌ణ‌లు చేసి, అల్ల‌రి చేసి, నానా గాయి చేస్తున్నారు అని మంత్రి విమ‌ర్శించారు.త్వరలోనే ప్రతి నియోజకవర్గానికి 3 వేల మందికి సొంత జాగాలో ఇండ్లు కట్టుకునే వీలు సీఎం కల్పిస్తున్నామ‌ని ప్ర‌జ‌ల హ‌ర్ష‌ధ్వానాల మ‌ధ్య మంత్రి ప్ర‌క‌టించారు. ఇంకా కొన్ని ప‌నులు చేయాల్సి ఉంది. అవ‌న్నీ పూర్తి చేస్తాం. చెప్పిన‌వ‌న్నీ చేశాం. చెప్ప‌నివి కూడా ఎన్నో చేశామ‌ని మంత్రి వివ‌రించారు.

గ్రామ పంచాయతీలకు చిల్లి గవ్వ బాకీ లేం. మొత్తం డబ్బులు చెల్లించాం. కేంద్రమే ఇవ్వాల్సిన డబ్బులను నిలిపివేసింది. బ‌కాయీల‌ను పెండింగ్‌లో పెట్టింది. రాష్ట్రాన్ని బ‌ద్నాం చేయ‌డానికి పూనుకుంది. ఇదంతా అర్థంకాకుండా కొంద‌రు స‌ర్పంచ్‌లు ఆందోళ‌న ప‌డుతున్నారు. మ‌రికొంద‌రు కావాల‌నే ఆందోళ‌న చేస్తున్నారు. ప్ర‌తిప‌క్షాల చేతుల్లో పావులు కావొద్దు. సర్పంచులు ఆగమాగం కావొద్దు. గ్రామాల‌ను ఆదుకోవ‌డానికి ఇంత పెద్ద ఎత్తున ప‌ల్లె ప్ర‌గ‌తి నిర్వ‌హిస్తున్న‌వాళ్ళం… స‌ర్పంచ్ ల‌కు విశేష అధికారాలు ఇచ్చిన వాళ్ళం వాళ్ళ‌ని ఇబ్బందుల‌కు గురి చేస్తామా? ఆలోచించాల‌ని మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. కాంగ్రెస్, బీజేపీల మాటలు నమ్మకండని మంత్రి పిలుపునిచ్చారు.కాగా, కీసర గ్రామానికి కోటి రూపాయలు మంజూరు చేస్తానని, ఇక్క‌డ అభివృద్ధికి పూర్తిగా స‌హ‌క‌రిస్తామ‌ని మంత్రి ప్ర‌జ‌ల క‌ర‌త‌ళా ధ్వ‌నుల మ‌ధ్య ప్ర‌క‌టించారు.

- Advertisement -