ఐపీఎల్ సీజన్ 13లో వరుస విజయాలతో దూసుకుపోతోంది ఢిల్లీ క్యాపిటల్స్. ఇక చెన్నై వరుసగా రెండో ఓటమితో ధోని సేనకు నిరాశే ఎదురైంది. దుబాయ్ వేదికగా చెన్నైతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 44 పరుగుల తేడాతో విజయం సాధించింది.
176 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై ఏడు వికెట్లు కొల్పోయి 131 పరుగులు మాత్రమే చేసింది. చెన్నై ఆటగాళ్లలో షేన్ వాట్సన్(17),, మురళీ విజయ్(10), డుప్లెసిస్(43; 35 బంతుల్లో 4 ఫోర్లు),కేదార్ జాదవ్(26 ) పరుగులు చేయగా ధోని,రుతురాజ్ నిరాశ పర్చారు. ఢిల్లీ బౌలర్లలో రబడా మూడు వికెట్లు సాధించగా, నోర్త్జే రెండు వికెట్లతో మెరిశాడు.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీకి ఓపెనర్లు మంచి శుభారంభాన్నిచ్చారు. తొలి వికెట్కు 94 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదుచేశారు. పృథ్వీ షా(64; 43 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్), శిఖర్ ధావన్(35; 27 బంతుల్లో 3 ఫోర్లు, 1 ఫోర్), శ్రేయస్ అయ్యర్(26), రిషభ్ పంత్(37; 25 బంతుల్లో 6 ఫోర్లు)లు రాణించడంతో ఢిల్లీ భారీ స్కోరు సాధించింది.