రాష్ట్రంలో ఒమిక్రాన్ వ్యాప్తి.. సీఎస్‌ కీలక ఆదేశాలు..

149
- Advertisement -

ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేష్ కుమార్ బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సంబంధిత ఉన్నతాధికారులతో ఉన్నత స్ధాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కోవిడ్ పరిస్థితిని సమీక్షించారు. అనేక రాష్ట్రాల్లో వేగంగా వ్యాప్తి చెందుతున్న ఓమిక్రాన్ వేరియంట్ కేసులు, కోవిడ్-19 కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని, తెలంగాణ రాష్ట్రంలో కూడా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, తగిన నివారణ చర్యలు కూడా చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు.

ఒమిక్రాన్, కోవిడ్ కేసుల వ్యాప్తి నేపధ్యంలో కోవిడ్ నిబంధనల మేరకు మతపరమైన, రాజకీయ మరియు సాంస్కృతిక సంబంధిత కార్యక్రమాలతో సహా అన్ని రకాల ర్యాలీలు, బహిరంగ సమావేశాలకు అనుమతి ఇవ్వకూడదని, ప్రజా రవాణాలో, దుకాణాలు, మాల్స్, సంస్థల నిర్వహణలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్యాలయాలు పనిచేసే సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, కార్యాలయాలు, పాఠశాల ఆవరణలను తరచుగా శుభ్రం చేయడం, ఐఆర్ థర్మామీటర్/థర్మల్ స్కానర్, శానిటైజర్ సదుపాయలు ప్రజలకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలో సిబ్బంది, విద్యార్థులు మాస్కులు ధరించి కోవిడ్ నిబంధనలను పాటించేలా చూడాలని పాఠశాలలు, విద్యా సంస్థల యాజమాన్యాలకు సూచించారు.. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్కులు ధరించని వారిపై రూ.1000 జరిమానా విధించే ఉత్తర్వులను ఖచ్చితంగా అమలు చేయాలని, సీనియర్ సిటిజన్లు మరియు ధీర్ఘకాలిక వ్యాదులతో ఇబ్బంది పడుతున్న వ్యక్తులు జాగ్రత్తలు పాటించాలని ఆయన పేర్కొన్నారు.

ఈ సమావేశంలో డిజిపి శ్రీ మహేందర్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ ఎస్ ఏ ఎం రిజ్వీ, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా. శ్రీనివాస్ రావు, డా. గంగాధర్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డా. రమేశ్ రెడ్డి, టిఎస్ యండిసి యండి. శ్రీ చంద్రశేఖర్ రెడ్డి లు పాల్గొన్నారు.

- Advertisement -