క్రాస్ ఓటింగ్..హైకోర్టుకు BJD

0
- Advertisement -

ఒడిశా రాజ్యసభ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ సమర్పించిన పిటిషన్‌ను అసెంబ్లీ స్పీకర్ సురమా పాఢీ తిరస్కరించడంపై ప్రతిపక్ష బిజూ జనతా దళ్ (BJD) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. స్పీకర్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని సవాలు చేస్తూ బీజేడీ ఒరిస్సా హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది.

మార్చిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల సందర్భంగా బీజేడీ తరఫున విప్‌ను ధిక్కరించి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ పార్టీ వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కోరింది. అయితే నిబంధనలకు అనుగుణంగా తగిన ఆధారాలు మరియు ధృవీకరణ పత్రాలు సరిగ్గా లేవనే సాంకేతిక సాకుతో బీజేడీ సమర్పించిన పిటిషన్‌ను స్పీకర్ సురమా పాఢీ జూన్‌లో కొట్టివేశారు.

స్పీకర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ బీజేడీ చీఫ్ విప్ ప్రమీలా మల్లిక్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ తమ వాదనలను వినిపించడానికి కనీస అవకాశం కూడా ఇవ్వకుండా స్పీకర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆమె ఆరోపించారు. చిన్నపాటి సాంకేతిక లోపాలను సరిదిద్దుకునే అవకాశం ఇవ్వకుండా, ఫిరాయింపుల నిరోధక చట్టం యొక్క ప్రధాన ఉద్దేశాన్ని పక్కనబెట్టి పిటిషన్‌ను కొట్టివేయడం రాజ్యాంగ విరుద్ధమని బీజేడీ తన పిటిషన్‌లో పేర్కొంది. ఈ వ్యవహారంపై న్యాయస్థానం ఇచ్చే తీర్పు కోసం రాష్ట్ర రాజకీయంలో ఉత్కంఠ నెలకొంది.

Also Read:ప్రోటీన్ పౌడర్‌లో పురుగులు..నటి ఫిర్యాదు!

- Advertisement -