ప్రముఖ బాలీవుడ్ నటి బిపాసా బసు ఆహార భద్రతకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల తాను కొత్తగా కొనుగోలు చేసిన ఒక ప్రముఖ బ్రాండ్ (‘ఐసోప్యూర్’) ప్రోటీన్ పౌడర్ డబ్బాను తెరవగా అందులో చిన్న చిన్న పురుగులు కనిపించాయని ఆమె ఆరోపించారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పంచుకున్న బిపాసా బసు, వేలిపై ఉన్న పురుగును చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. “కొత్తగా విప్పిన ఈ ప్రోటీన్ పౌడర్ డబ్బా నిండా చిన్న చిన్న పురుగులు ఉన్నాయి” అని చెబుతూ, మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కమిషనర్ ఐఏఎస్ అధికారి తుకారాం ముండేని ట్యాగ్ చేశారు.
వినియోగదారులకు కల్తీ లేని, నాణ్యమైన ఆహార పదార్థాలు అందాలంటే మీరే మాకు ఏకైక ఆశ. దయచేసి ఈ విషయంపై దృష్టి సారించండి అని బిపాసా బసు ప్రభుత్వ అధికారులను కోరారు.
ప్రస్తుతం మహారాష్ట్రలో ఆహార కల్తీ, నాణ్యతా ప్రమాణాలపై ఎఫ్డిఏ కమిషనర్ తుకారాం ముండే విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే బిపాసా బసు చేసిన ఈ పిర్యాదు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సెలబ్రిటీలు ఉపయోగించే ప్రముఖ బ్రాండెడ్ ఉత్పత్తుల్లోనే ఇలాంటి పురుగులు, కల్తీ రావడం పట్ల నెటిజన్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ, సదరు ఉత్పత్తుల నాణ్యతపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read:KTR:కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో

