పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ- అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఈ కాల్లో ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ కూడా పాల్గొన్నట్లు వార్తలు రావడం మరింత వివాదానికి దారితీసింది.
ఈ ఫోన్ కాల్పై ప్రముఖ అమెరికన్ పత్రిక ది న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ప్రచురించగా దేశాధినేతల మధ్య జరిగిన కీలక చర్చలో మస్క్ పాల్గొనడం ప్రోటోకాల్ పరంగా అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. సాధారణంగా దేశాధినేతల మధ్య జరిగే చర్చలు అత్యంత గోప్యంగా, అధికారిక వ్యవస్థల పరిధిలోనే జరుగుతాయి. అయితే, ప్రస్తుతం ఎలాంటి ప్రభుత్వ హోదా లేని మస్క్ ఈ సంభాషణలో భాగమవడం రాజకీయ వర్గాల్లో విమర్శలకు కారణమైంది. ఇది దౌత్య పరమైన నియమాలను ఉల్లంఘించినట్టుగా కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గతంలో ట్రంప్ ప్రభుత్వంతో అనుబంధం ఉన్నప్పటికీ, ప్రస్తుతం మస్క్కు ఎలాంటి అధికారిక బాధ్యతలు లేవు. అంతేకాక, ఇటీవలి కాలంలో ట్రంప్ విధానాలను విమర్శిస్తూ మస్క్ వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఈ కాల్లో పాల్గొనడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ ఘటన భవిష్యత్ దౌత్య సంబంధాలపై ప్రభావం చూపుతుందా అన్నదానిపై చర్చ కొనసాగుతోంది. ముఖ్యంగా, అంతర్జాతీయ వ్యవహారాల్లో ప్రైవేట్ వ్యక్తుల పాత్ర ఎంతవరకు ఉండాలి అనే ప్రశ్న మళ్లీ ముందుకు వచ్చింది.
Also Read:జుట్టు ఊడిపోవడం…పరిష్కారం!

