తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చింది. దీంతో ఇకపై ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ పేరిట ఈ పథకం అమలు చేయనున్నారు. తెలంగాణలో ఆరోగ్యశ్రీ కింద 1,026 చికిత్సలు అమలులో ఉండగా.. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్.. రెండింటిలో కలసిన చికిత్సలు 810 ఉన్నాయి. మరో 216 ఆరోగ్యశ్రీ చికిత్సలు ఆయుష్మాన్ భారత్లో లేకపోయినా వాటిని గతంలో మాదిరిగానే కొనసాగించనున్నారు.
ఇప్పటివరకూ ఆరోగ్యశ్రీ పరిధిలో కేవలం 50 బెడ్స్ ఉన్న ఆస్పత్రులకు మాత్రమే అనుమతి ఉండగా ఆయుష్మాన్ భారత్ చేరికతో ఇకనుంచి 6 బెడ్స్ ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో.. 30 బెడ్స్ ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 6 బెడ్స్ ఉన్న ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ను అమలు చేయడానికి అవసరమైన గైడ్లైన్స్ను రూపొందించిన తర్వాత ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించనుంది.
రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ రాకతో ప్రజలకు ఉచితంగా అందుబాటులోకి వచ్చిన చికిత్సల సంఖ్య 1,668కి పెరిగింది. అయితే వీటిలో 642 చికిత్సలను ప్రస్తుతానికి ప్రభుత్వ వైద్యంలోనే కొనసాగించాలని నిర్ణయించారు.