యాసంగి పంట కాలంలో వివిధ రకాల ప్రయివేటు విత్తన కంపెనీలు, సీడ్ కార్పొరేషన్ వారితో ఒప్పందం ఉన్న రైతులు వరి విత్తన ఉత్పత్తి చేసుకోవచ్చని తెలిపారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్. బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో యాసంగి వరి పంటకు ప్రత్యామ్నాయ పంటలపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొనని మాట్లాడారు.
జిల్లాలో యాసంగి సాగుకు అనుకూలమైన శనగ, పెసర, మినుములు వంటి పప్పుదినుసులతో పాటు వేరుశనగ, నువ్వులు, ఆవాల వంటి నూనెగింజల పంటలను సాగు చేయాలన్నారు. ఈ పంటల ద్వారా అధిక ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు. ఈ పంటల సాగుకు అవసరమైన విత్తనాలను సీడ్ కార్పొరేషన్, అధికృత డీలర్ల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు.
ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లాలో 351 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీడ్ ప్రొడక్షన్కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పంటల సాగులో ఏమైనా సమస్యలు, సందేహాలు ఉంటే రైతు వేదికల ద్వారా జిల్లా వ్యాప్తంగా శిక్షణా కార్యక్రమాలు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.