Revanth Reddy:ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు

4
- Advertisement -

తెలంగాణ బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం 1948 సెప్టెంబర్‌ 17న ఇదే హైదరాబాద్‌ గడ్డపై ఆవిష్కృతమైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు రేవంత్. తెలంగాణ అంటే త్యాగం… ఆ త్యాగాలకు ఆద్యుడు దొడ్డి కొమురయ్య అన్నారు. నాటి సాయుధ పోరాటంలో ఎందరో ప్రాణ త్యాగాలు చేశారు…ఆ నాటి సాయుధ పోరాటంలో అమరులైన వీరులకు ఈ సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నా అన్నారు.

తెలంగాణ ప్రజలకు ‘‘ప్రజా పాలన దినోత్సవ’’ శుభాకాంక్షలు తెలిపారు. సెప్టెంబర్‌ 17 తెలంగాణ ప్రస్థానంలో అత్యంత కీలకమైన రోజు.  ఈ శుభదినాన్ని ఎలా నిర్వచించుకోవాలన్న విషయంలో ఇప్పటి వరకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అన్నారు. కొందరు విలీన దినోత్సవమని, కొందరు విమోచన దినోత్సవమని సంబోధిస్తున్నారు…ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించాం అన్నారు.

స్వప్రయోజనాల కోసం నాటి అమరుల త్యాగాలను పలుచన చేసేలా ప్రవర్తించడం సరికాదని ప్రజా ప్రభుత్వం భావించిందన్నారు. అందుకే… ఈ శుభదినానికి ప్రజా కోణాన్ని జోడిస్తూ… ‘‘ప్రజా పాలన దినోత్సవం’’ గా నామకరణం చేశాం అన్నారు. ప్రజా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష… వారి ఆలోచన అన్నారు. ఇది నాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి..మనం జాగ్రత్తగా గమనిస్తే… తెలంగాణ భౌగోళిక స్వరూపం బిగించిన పిడికిలి మాదిరిగా ఉంటుందన్నారు.

పిడికిలి పోరాటానికి సింబల్‌…తెలంగాణలో అన్ని జాతులు, అన్ని కులాలు, మతాలు కలిసికట్టుగా  ఉంటాయన్న సందేశం ఇందులో ఇమిడి ఉందన్నారు. ఈ ఐక్యతను, ఈ సమైక్యతను దెబ్బతీసే విధంగా సెప్టెంబర్‌ 17ను కొందరు వివాదాస్పదం చేసే ప్రయత్నం చేయడం క్షమించరాని విషయం..బిగించిన పిడికిలి కొండలనైనా పిండి చేయగలదు అన్నారు. ఇది నాలుగు కోట్ల ప్రజల పిడికిలి…. ఇది ఎప్పటికీ అలాగే ఉండాలి.. పెత్తందార్లపై, నియంతలపై ఈ పిడికిలి ఎప్పటికీ పోరాట సంకేతంగా ఉండాలన్నారు. గడచిన పదేళ్లలో తెలంగాణ నియంత పాలనలో మగ్గిపోయింది..ఆ బానిస సంకెళ్లను తెంచడానికి మాకు స్ఫూర్తి సెప్టెంబర్‌ 17 అన్నారు.

గజ్వేల్‌ గడ్డ మీద 2021 సెప్టెంబర్‌ 17 నాడు ‘‘దళిత – గిరిజన ఆత్మగౌరవ దండోరా’’ మోగించినం…2023 డిసెంబర్‌ 3 నాడు తెలంగాణకు స్వేచ్ఛను ప్రసాదించడంలో మాకు స్ఫూర్తి నాటి సాయుధ పోరాటమే అన్నారు. మా ఆలోచన, మా ఆచరణ ప్రతీది ప్రజా కోణమే…అందుకే ఈ శుభ దినాన్ని ‘‘ప్రజా పాలన దినోత్సవం’’ గా అధికారికంగా నిర్వహిస్తున్నాం అన్నారు. మూసీ సుందరీకరణ హైదరాబాద్‌ రూపు రేఖలను మార్చి వేస్తుందనడంలో సందేహం లేదు అని..ఈ ప్రాజెక్టు కేవలం పర్యాటక ఆకర్షణ మాత్రమే కాదు అన్నారు

వేలమంది చిరు, మధ్య తరగతి వ్యాపారులకు ఒక ఎకనామిక్‌ హబ్‌గా తీర్చి దిద్దబోతున్నాం..తెలంగాణలో యువ వికాసం కోసం ప్రజా ప్రభుత్వం ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళుతోందన్నారు. ఒకవైపు గడచిన పదేళ్లుగా రాష్ట్రానికి పట్టిన మత్తును వదిలిస్తున్నాం…మాదక ద్రవ్యాల నియంత్రణ, నిర్మూలన విషయంలో కఠినంగా ఉంటున్నాం అన్నారు.

Also Read:జానీ మాస్ట‌ర్‌కు జనసేనకు షాక్‌..

టీ – న్యాబ్‌ ను బలోపేతం చేశాం…మరోవైపు క్రీడలను ప్రోత్సహిస్తున్నాం అన్నారు. పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన తెలంగాణ బిడ్డలను ఘనంగా గౌరవించుకున్నాం. ఇటీవలే ఇంటర్‌ కాంటినెంటల్‌ ఫుట్‌బాల్‌ పోటీలను హైదరాబాద్‌లో నిర్వహించుకున్నాం అన్నారు. యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటుతో యువతలో నైపుణ్యాలకు పదును పెడుతున్నాం… ఉపాధి, ఉద్యోగ భద్రతకు భరోసా ఇవ్వబోతున్నాం అన్నారు.యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు తెలంగాణ క్రీడా చరిత్రలో ఒక కీలక మలుపు కాబోతోందని..క్రీడలు సమాజ వికాసంలో కీలక పాత్ర పోషిస్తాయని మేం నమ్ముతున్నాం అన్నారు.

పర్యావరణ పునరుజ్జీవనం కూడా జరగాల్సిన అవసరం ఉంది అందుకే హైడ్రాను ఏర్పాటు చేశాం అన్నారు. ఒకప్పుడు లేక్‌ సిటీగా పేరు పొందిన హైదరాబాద్‌.. ఫ్లడ్స్‌ సిటీగా దిగజారిపోవడానికి కారణం గత పాలకుల పాపమే అన్నారు. వాటి ప్రక్షాళన కోసమే హైడ్రా ఏర్పాటు చేశాం..చెరువులు, నాలాలు కాపాడుకోకపోతే భవిష్యత్‌ తరాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. ఇటీవల కేరళలో ప్రకృతి విలయ తాండవం మనం చూశాం…వేలాది ప్రాణాలు ప్రకృతి ప్రకోపానికి బలయ్యాయి అన్నారు. ఆ పరిస్థితి హైదరాబాద్‌కు రాకూడదు…హైడ్రా వెనుక రాజకీయ కోణం లేదు… స్వార్థం లేదు అన్నారు. అదొక పవిత్ర కార్యం…. ప్రకృతిని కాపాడుకునే యజ్ఞం….దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. కొందరు భూ మాఫియాగాళ్లు పేదలను ముందు పెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నంలో ఉన్నారు..ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు అన్నారు. హైదరాబాద్‌ భవిష్యత్‌కు హైడ్రా గ్యారెంటీ ఇస్తుంది..ఇది నా భరోసా…. ప్రజలు సహకరించాల్సిందిగా కోరుతున్నా అన్నారు రేవంత్.

- Advertisement -