సీఎం కేసీఆర్‌ కలెక్టర్లతో సమావేశం..

267
cm kcr meeting
- Advertisement -

గ్రామాభివృద్ధి ప్రణాళిక, ఉపాధి హామీ పథకం, హరితహారం –అడవుల పునరుద్ధరణ, పల్లె ప్రగతి –గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత, రైతుబంధు –రైతువేదికల నిర్మాణం, ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ ల ఏర్పాటు, కరోనా–అంటువ్యాధులు, మిడతల దండు, నకిలీ విత్తనాలు, కరెంటు బిల్లుల చెల్లింపు తదితర అంశాలపై కలెక్టర్ల సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. వివిధ జిల్లాల కలెక్టర్లు, సీనియర్ అధికారులు తమ అభిప్రాయాలు చెప్పారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు మార్గదర్శకం చేశారు. అవి ఇలా ఉన్నాయి.

-గ్రామాలు, పట్టణాలు బాగుపడితే రాష్ట్రం బాగుపడినట్టే. ప్లానింగ్ ఆఫ్ టౌన్, ప్లానింగ్ ఆఫ్ విలేజ్ అంటే ప్లానింగ్ ఆఫ్ స్టేట్ అన్నట్లే. వనరులు, అవసరాలను బేరీజు వేసుకుని గ్రామాల వారీగా నాలుగేళ్ల ప్రణాళిక తయారు కావాలి. దాని ఆధారంగా డిస్ట్రిక్ట్ ప్రోగ్రెస్ కార్డు రూపొందించాలి. దాని ప్రకారమే పనులు జరగాలి.

-కొత్త పంచాయతీ రాజ్ చట్టం ద్వారా ప్రభుత్వం తన వద్ద ఉన్న అధికారాలను వదులుకుని కలెక్టర్లకు పూర్తి అధికారాలు అప్పగించింది. గ్రామ కార్యదర్శి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పంచాయతీరాజ్ శాఖలో ఖాళీలు భర్తీ చేసింది. కరోనా కష్టకాలంలో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ ప్రతీ నెలా 308 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేస్తున్నది. అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు ఏడాదికి ఐదు లక్షల రూపాయల కన్నా తక్కువ ఆదాయం కలిగిన గ్రామ పంచాయతీలకు అదనపు నిధులిచ్చి, ఐదు లక్షలకు చేరుకునేట్లు చేస్తాం.

-గ్రామ పంచాయతీలకు రూ.3,694 కోట్ల ఫైనాన్స్ కమిషన్ నిధులు, రూ.5,885 కోట్ల నరేగా నిధులు, రూ. 337 కోట్ల పంచాయతీల సొంత ఆదాయం ఉన్నాయి. అంతా కలిపితే ఏడాదికి రూ. 9,916 కోట్లు సమకూరుతాయి. నాలుగేళ్లలో రూ.39,594 కోట్లు వస్తాయి. ఈ నిధులింకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ నిధులతో ఏఏ పనులు చేసుకోవచ్చో గ్రామాల వారీగా ప్రణాళిక రూపొందించుకోవాలి.

-గ్రామ పంచాయతీలు ఖచ్చితంగా చార్జుడ్ అకౌంట్ నిర్వహించాలి. అప్పులు క్రమం తప్పకుండా చెల్లించాలి. ట్రాక్టర్ల లోన్ రీ పేమెంట్ చేయాలి. కరెంటు బిల్లులు ప్రతీ నెలా తప్పక చెల్లించాలి. 10 శాతం నిధులు హరితహారానికి కేటాయించాలి.

-గ్రామ వికాసం కోసం జరిగే చర్యల్లో విస్తృత ప్రజా భాగస్వామ్యం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం స్టాండింగ్ కమిటీలు ఏర్పాటు చేసింది. గ్రామాల్లో నాలుగు రకాల స్టాండింగ్ కమిటీలున్నాయి. వర్స్క్ కమిటీ, శానిటేషన్ కమిటీ, స్ర్టీట్ లైట్ కమిటీ, గ్రీన్ కవర్ కమిటిలలో 15 మంది చొప్పున సభ్యులున్నారు. మొత్తం 8,20,727 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులున్నారు. స్టాండింగ్ కమిటీల సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించాలి. వీరంతా కలిస్తే ఓ సైన్యం. వీరిని క్రియాశీలం చేస్తే పల్లెల అభివృద్ధి ఉద్యమంలా సాగుతుంది.

-ప్రజలతో ఎన్నికైన 1,32,973 మంది గ్రామీణ ప్రాంత ప్రజాప్రతినిధులున్నారు. 32 మంది జడ్పీ చైర్మన్లు, 539 మంది ఎంపిపిలు, 539 మంది జడ్పీటిసిలు, 5,758 మంది ఎంపిటిసిలు, 12,751 మంది సర్పంచులు, 1,13,354 మంది వార్డు సభ్యులున్నారు. వీరందరినీ భాగస్వాములను చేస్తూ తెలంగాణ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి.

-గ్రామాభివృద్ధి పనుల నిర్వహణలో ఎలాంటి ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం అన్ని స్థాయిలో పోస్టులను భర్తీ చేసింది. మొత్తం 13,993 మంది అధికారులు కేవలం గ్రామాభివృద్ధి పనికోసమే ఉన్నారు. 32 మంది అడిషనల్ కలెక్టర్లు, 32 మంది సిఇవోలు, 32 మంది డిపివోలు, 68 మంది డి.ఎల్.పి.ఓ.లు, 539 మంది ఎంపిడివోలు, 539 మంది ఎంపివోలు, 12,751 : గ్రామ కార్యదర్శులున్నారు. వీరంతా ప్రతీ రోజు పర్యవేక్షిస్తే, తమ విధులు సక్రమంగా నిర్వహిస్తే గ్రామ వికాసం చాలా వేగంగా, అనుకున్న విధంగా జరుగుతుంది.

-ఇప్పుడు గ్రామాలు కూడా చిన్నగా అయ్యాయి. గిరిజన తండాలు, గూడాలు, మారుమూల పల్లెలను కూడా ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా చేశాము. దీనివల్ల పనుల నిర్వహణ, పర్యవేక్షణ తేలికవుతుంది.

-ప్రతీ ఏటా రూ.10,000 కోట్ల నిధులు,13,993 మంది అధికారులు, 1,32,973 మంది ప్రజా ప్రతినిధులు, 8,20,727 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులు, కలెక్టర్లకు విస్తృత అధికారాలున్నాయి. గ్రామాల వికాసాన్ని కాంక్షించే ప్రభుత్వం, అది తీసుకున్న విధానాలు గొప్పగా ఉన్నాయి. ఇన్ని అనుకూలతలున్న ప్రస్తుత తరుణంలో మార్పు రాకుంటే, గ్రామాలు బాగుపడకుంటే ఇక ఎప్పటికీ మార్పు రాదు. ప్రజల్లో అవగాహన, స్పూర్తి కలిగించి ఉద్యమ స్పూర్తితో గ్రామాలను అభివృద్ధి చేసే కార్యక్రమాలను కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు తమ భుజస్కంధాలపై వేసుకుని నడిపించాలి.

-తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వాత పరిస్థితిని పోల్చి చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మార్పు కనిపిస్తున్నది. పల్లె ప్రగతి వల్ల గ్రామాల్లో పరిస్థితి మారింది. ఆశాజనకంగా ఉంది. మార్పుకు మనం శ్రీకారం చుట్టాము. ఈ స్పూర్తి కొనసాగాలి. ఇంకా ఎంతో జరగాలి. అంతవరకు విశ్రమించకూడదు.

-ప్రతీ గ్రామానికి ట్రాక్టర్, వైకుంఠ ధామం, నర్సరీ, డంపు యార్డు దేశంలో ఎక్కడా లేవు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అవి సమకూరుతున్నాయి. ఇదొక అద్భుతం, ఇదొక విప్లవం. తెలంగాణ రాష్ట్రం సాధించిన గొప్ప విజయం. తెలంగాణ ప్రజలకు గర్వకారణం. అన్ని గ్రామాలకు ట్రాక్టర్లు వచ్చాయి. వాటికి ట్యాంకర్లు, ట్రాలీలు కూడా వస్తున్నాయి. ఈ నెలాఖరుకు అన్నీ సమకూరుతాయి. అన్ని గ్రామాల్లో నర్సరీలు నడుస్తున్నాయి. మొక్కలను సిద్దం చేస్తున్నారు. డంప్ యార్డులు, వైకుంఠధామాల నిర్మాణం కోసం స్థలాల కేటాయింపు జరిగింది. అన్నీ నిర్మాణ దశలో ఉన్నాయి. రెండు నెలల్లో వైకుంఠ ధామాల నిర్మాణం పూర్తవుతుంది.

-పల్లె ప్రగతి పేరుతో అప్పుడప్పుడు కార్యక్రమం నిర్వహించడం కాదు. ప్రతీ రోజు ప్రతీ గ్రామం శుభ్రం కావాల్సిందే. ముఖ్యమంత్రి, సిఎస్ నుంచి మొదలుకుని ప్రతీ ఒక్కరి ప్రాధాన్యత గ్రామాలు పరిశుభ్రంగా ఉండడమే. దానికి మించిన పని మరోటి లేదు. గ్రామాలు శుభ్రంగా ఉంటే, ఆరోగ్య సమస్యలు రావు. రోగాలు దరిచేరవు. ఆరోగ్యం కోసం అటు ప్రజలు, ఇటు ప్రభుత్వం పెట్టే ఖర్చు తగ్గుతుంది. గ్రామాల్లో పారిశుధ్య పనులు బాగా జరగాలనే ఉద్దేశ్యంతోనే కరోనా కష్ట సమయంలో కూడా గ్రామ పంచాయతీ పారిశుధ్య సిబ్బందికి నెలకు ఐదు వేల అదనపు వేతనం చెల్లిస్తున్నాం.

-గ్రామాల్లో గుంతలు తొలగించాలి. పాడు పడిన బావులను పూడ్చాలి. ఉపయోగించని బోర్లను పూడ్చాలి. పిచ్చి చెట్లను, సర్కారు తుమ్మను తొలగించాలి. ప్రతీ గ్రామంలో ఈ పనులు జరగాలి. నేను గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తాను. రాష్ట్రంలో ఏమూలకు పోయి చూసినా అంతా శుభ్రంగా కనిపించాలి. అప్పుడు ఈ చెత్తా చెదారం, ముళ్ల పొదలు కనిపిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం.

-గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీలతోపాటు మండల పరిషత్, జిల్లా పరిషత్ లు కూడా ఉన్నాయి. ఫైనాన్స్ కమిషన్ నిధుల్లో పది శాతం మండల పరిషత్ లకు, ఐదు శాతం జిల్లా పరిషత్ లకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

-గ్రామాల్లో పచ్చదనం, పారిశుధ్యం విధుల నిర్వహణలో కానీ, ఇతర అభివృద్ధి పనుల నిర్వహణలో గానీ ఎవరైనా అలసత్వం ప్రదర్శిస్తే ఎట్టి పరిస్థితుల్లో క్షమించవద్దు. కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం పూర్తి అధికారాలు ఇచ్చింది. ఎలాంటి రాజకీయ జోక్యం ఉండదు.

-గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా ఉంది. 2020-21 సంవత్సరంలో తెలంగాణకు 13 కోట్ల పనిదినాలను లక్ష్యంగా ఇస్తే, ఇప్పటికే 9.81 కోట్ల పనిదినాలను (75.5 శాతం) పూర్తి చేసి కూలీలకు ఉపాధి కల్పించాం. దీనివల్ల లక్షలాది మందికి ఉపాధి దొరికింది. ఇంత పెద్ద ఎత్తున దేశంలో మరెక్కడా పనులు జరగలేదు. 53.5 శాతంతో చత్తీస్ గఢ్ రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. దేశ సగటు 26.3 శాతం మాత్రమే ఉంది. తెలంగాణలో నరేగా పనులను సమర్థవంతంగా నిర్వహించిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఈ శాఖ అధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లకు అభినందనలు.

-నరేగాను మరింత వ్యూహాత్మకంగా వాడుకోవాలి. మన కూలీలకు ఎక్కువ పని కల్పించాలి. మన రాష్ట్రంలో ఎక్కువ పనులు చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగపడే పనులు జరగాలి. ఆ విధంగా ప్రణాళికలు తయారు చేయాలి. నర్సరీలు, మొక్కల పెంపకం పనులు, అన్ని రకాల రోడ్లపై చెట్లు, పొదల తొలగింపు పనులు, చెరువులో, చెరువు కట్టలపై చెట్ల తొలగింపు పనులు, కాల్వల మరమ్మత్తులు, పూడికతీత పనులు, వైకుంఠధామాల నిర్మాణం, డంపుయార్డుల నిర్మాణం, గ్రామాల్లో అంతర్గత రహదారుల నిర్మాణం, అంగన్ వాడీ కేంద్రాల నిర్మాణం, మురుగు నీరు, నిల్వ ఉన్న నీటి తొలగింపు పనులు, పాఠశాలల్లో ఆట స్థలాల ఏర్పాటు, పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణం, కల్లాల నిర్మాణం, వ్యవసాయ భూమిని చదను చేసుకునే పనులు, పంట చేలకు పశువులు రాకుండా ట్రెంచ్ నిర్మాణం, ఇంకుడు గుంతల ఏర్పాటు, గొర్రెల, మేకలు, బర్రెలు, కోళ్ల కోసం షెడ్ల నిర్మాణం, వర్మి కంపోస్టు, కంపోస్టు తయారీ షెడ్ల నిర్మాణం, పాడుపడిన బావుల పూడ్చివేత, మంచినీటి బావుల్లో పూడిక తీత పనులు తదితర ప్రజోపయోగ పనులను నరేగా ద్వారా చేపట్టాలి.

-ప్రధాన రహదారుల వెంట ఉన్న ముళ్ల పొదలు,చెట్ల తొలగింపు పనులను నరేగా ద్వారా చేయాలి.

-కాల్వల్లో పేరుకుపోయిన పూడికను, చెట్లను తొలగించడానికి నరేగాను వాడుకోవాలి.

-వ్యవసాయం లేని పట్టణ నియోజకవర్గాలను మినహాయించి, రాష్ట్రంలోని అన్ని గ్రామీణ నియోజకవర్గాల్లో మొత్తం లక్ష కల్లాలను ఈ ఏడాది నిర్మించాలని నిర్ణయించాం. ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి కల్లాలు కేటాయిస్తాం. రైతులకున్న భూమి, అవసరాన్ని బట్టి 50, 60, 75 చదరపు అడుగుల విస్తీర్ణాల్లో కల్లాల నిర్మాణానికి అనుమతులు ఇస్తాం. ప్రతీ ఏటా ప్రతీ నియోజకవర్గానికి వెయ్యి చొప్పున కేటాయిస్తాం. ఎక్కువ మంది రైతులు ముందుకొస్తే, లాటరీ ద్వారా ఎంపిక చేయడం జరగుతుంది. రూ.750 కోట్ల వ్యయం అయ్యే కల్లాల నిర్మాణానికి నరేగా నిధులు వినియోగించాలి. ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం సబ్సిడీతో నిర్మించాలి. మిగతా వారు 10 శాతం లబ్దిదారుడి వాటాగా చెల్లిస్తే, 90 శాతం సబ్సిడీ ఇస్తాం.

-ఈ సారి ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్, నీటి పారుదల లాంటి ఇంజనీరింగ్ శాఖలతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో నరేగా పనులు చేయాలని నిర్ణయించినందున నరేగా ఇంజనీరింగ్ ఆఫీసర్స్ (ఎన్.ఇ.ఓ)ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

-నరేగా ముఖ్య ఉద్దేశ్యమే కూలీలకు ఉపాధి కల్పించడం. కాబట్టి కూలీలకు చాలా తొందరగా డబ్బులు వచ్చేలా అధికారులు శ్రద్ధ తీసుకోవాలి.

-కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్థిక సంక్షోభం ఉంది. అయినప్పటికీ రైతులు ఇబ్బంది పడవద్దనే ఉద్దేశ్యంతో వెంటనే రైతులందరికీ రైతుబంధు డబ్బులు ఇవ్వాలని నిర్ణయించాం. ఏ ఒక్క రైతునూ మినహాయించకుండా అందరికీ రైతుబంధు డబ్బులు వచ్చేలా చూడాలి. ఎవరికి రాకున్నా వారి వివరాలు తీసుకుని అందేలా చూడాలి.

-వర్షాకాలంలో నియంత్రిత పద్ధతిలో పంట సాగు చేయాలని ప్రభుత్వం పిలుపునిస్తే, రైతులు సంపూర్ణంగా పాటించారు. చెప్పిన ప్రకారం పంటలు సాగు చేస్తున్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి, ప్రయత్నానికి రైతుల నుంచి మద్దతు లభించింది. యాసంగిలో కూడా ఏ పంటలు వేయాలనే విషయంలో ప్రణాళిక రూపొందించి, అందుకు అనుగుణంగా సాగు చేయించాలి.

-తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అద్భుత వ్యవసాయ రాష్ట్రంగా రూపాంతరం చెందుతున్నది. ఈ సమయంలో రైతులకు మరింత చేదోడు వాదోడుగా ఉండాలి. రైతులకు అవసరమైన అవగాహన కల్పించడానికి, రైతులు పరస్పరం చర్చించుకోవడానికి వీలుగా క్లస్టర్ల వారీగా రైతు వేదికలు నిర్మించాలని నిర్ణయించాం. ఈ వేదికల నిర్మాణం నాలుగు నెలల్లో పూర్తి కావాలి.

-నకిలీ, కల్తీ విత్తనాల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. పోలీసుల సహకారంతో నకిలీ విత్తన వ్యాపారం చేసే వారిని పట్టుకోవాలి. పిడి యాక్టు నమోదు చేయాలి. నకిలీ విత్తనాల వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. విలువైన పంటకాలం పోతుంది. తీవ్ర ఇబ్బందులకు గురై రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఒకమాటలో చెప్పాలంటే నకిలీ విత్తన వ్యాపారులు రైతు హంతకులు. వారిపట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలి. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో నకిలీ, కల్తీ విత్తనాల దందా ఆగిపోవాలి. రైతుబంధు సమితులు నకిలీ విత్తనాలను అమ్మే వారిని పట్టుకునే విషయంలో చురుగ్గా వ్యవహరించాలి.

-నకిలీ, కల్తీ విత్తనాలు అమ్మే సమాచారం ఇచ్చిన వారికి రూ.5వేల నగదు ప్రోత్సాహం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారి పేర్లు గోప్యంగా ఉంచాలని అధికారులను ఆదేశించింది.

-రాష్ట్రంలో సాగునీటి వసతి పెరగడంతో పాటు, ప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యలు, మంచి వర్షాల కారణంగా పంటల దిగుబడి పెరుగుతున్నది. దేశ వ్యాప్తంగా ఎఫ్.సి.ఐ. సేకరించిన ధాన్యంలో తెలంగాణ అందించిందే 55 శాతం ఉంది. ఇది మన రైతాంగానికి గర్వకారణం, వ్యవసాయంలో సాధించిన ప్రగతికి సంకేతం.

-వ్యవసాయ ఉత్పత్తులు పెరగడంతో పాటు కనెక్టెడ్ ఆక్టివిటి (అనుబంధ ప్రక్రియలు) జరగాలి. పండిన ధాన్యమంతా బియ్యంగా మారేందుకు అవసరమైన మిల్లింగ్ సామర్థ్యం పెరగాలి. అలాగే పప్పులు, నూనెలు, పిండి తయారీకోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కావాలి. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ లు నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సెజ్ లకు కనీసం 500 మీటర్ల దూరం వరకు నివాస గృహాల నిర్మాణం కోసం లే అవుట్లకు అనుమతి ఇవ్వవద్దు.

-కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవుతున్నది. సీతారామ, పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, ఆదిలాబాద్ ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి సౌకర్యం పెరుగుతుంది. దీనికి అనుగుణంగా ఇరిగేషన్ నెట్ వర్క్ మ్యాపింగ్ చేయాలి. జిల్లాల వారీగా నెట్ వర్క్ వివరాలు కలెక్టర్ల దగ్గర ఉండాలి.

-రైతులు చెరువుల్లోని పూడిక మట్టిని స్వచ్ఛందంగా తీసుకుపోవడానికి అవకాశం ఇవ్వాలి. దీనివల్ల అటు పంట పొలాల్లో భూసారం పెరుగుతుంది. ఇటు చెరువుల్లో పూడిక పోతుంది. కాబట్టి రైతులను ప్రోత్సహించాలి.

-జూన్ 25 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం కార్యక్రమం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించాలి. ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలి. ఉద్యమ స్పూర్తితో పచ్చదనం పెంచే కార్యక్రమం సాగాలి. కలెక్టర్లు, డిపివోలు నాయకత్వం వహించాలి.

-వైకుంఠధామం, డంపు యార్డుల చుట్టూ ప్రహరీగోడలు కాకుండా, చెట్లు పెంచాలి. వాటికి గ్రీన్ వాల్ (ఎత్తయిన చెట్లు పెంచడం) నిర్మించాలి.

-సామాజిక అడవులు ఎంత పెంచినా, అది సహజ సిద్ధంగా పెరిగే అడువులకు సాటిరాదు. అందుకే అడవుల పునరుద్ధరణకు, ఉన్న అడవులను కాపాడడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. నిర్మల్, ఆసిఫాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, అచ్చంపేట, మెదక్ తదితర జిల్లాల్లో ఇంకా అడవి ఉంది. దాన్ని కాపాడాలి. స్మగ్లర్ల విషయలో కఠినంగా ఉండాలి. స్మగ్లర్లను గుర్తించి, పిడి యాక్టు నమోదు చేయాలి. అటవీ ప్రాంతాల్లో చెట్ల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలి.

-అధిక జనాభా, అధిక కాలుష్యం, తక్కువ అడవి ఉండే పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంచాలి. మున్సిపాలిటీల్లో పచ్చదనానికి కేటాయించిన పది శాతం నిధులు కూడా ఉన్నాయి. వాటిని వినియోగించుకోవాలి.

-రోడ్ల పక్కన, ఖాళీ ప్రదేశాల్లో చెట్లను పెంచడంతో పాటు, వ్యవసాయ క్షేత్రాల్లోని ఖాళీ జాగాల్లోకూడా చెట్లను పెంచాలి.

-తక్కువ సమయంలో, తక్కువ విస్తీర్ణంలోనే ఏపుగా పెరిగే లక్షణం ఉన్న మియావాకి పద్ధతిలో తెలంగాణలో చెట్లను పెంచాలి. ముఖ్యంగా కొండ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో ఈ పద్ధతి అవలంభించాలి. యాదాద్రి ఫారెస్ట్ మోడల్ గా దీనికి పేరు పెట్టాలి.

-రైసు మిల్లులలో పనిచేసే హమాలీలు, కూలీలు కరోనా నేపథ్యంలో తమ స్వస్థలాలైన బీహార్ తదితర రాష్ట్రాలకు వెళ్లారు. మళ్లీ వారు పనికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మిల్లుల యజమానులు వారిని తీసుకొస్తున్నారు. ఈ విషయంలో వారికి కలెక్టర్లు అవసరమైన సహకారం అందించాలి.

-మిడతల దండు ప్రమాదం తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా తొలగిపోలేదు. గతంలో వచ్చిన మిడతల దండులు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మీదుగా వెళ్లిపోయాయి. ప్రస్తుతం మరో దండు వార్దా సమీపంలోకి వచ్చింది. తెలంగాణకు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు జూన్ 25 నుంచి జూలై నెల వరకు మరోసారి మిడతల దండు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, కొత్తగూడెం, నిర్మల్, నిజమాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఈ జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులు, ఫారెస్ట్ అధికారులు, వ్యవసాయ అధికారులు, ఫైర్ అధికారులు, ఎంటమాలజీ నిపుణులు బుధవారం సమావేశమై అవసరమైన వ్యూహం ఖరారు చేయాలి.

-గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాలు ఖచ్చితంగా ప్రతీ నెలా కరెంటు బిల్లులు చెల్లించాలి. బకాయిలు ఉంటే క్షమించే ప్రసక్తే లేదు.

-పట్టణాలు, గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారానే మంచినీటి సరఫరా జరుగుతున్నందున గతంలో వాడిన మోటార్లను తొలగించాలి. అవి అలాగే ఉండడం వల్ల అనవసరంగా కరెంటు బిల్లులు, నిర్వహణ వ్యయం భారంగా మారుతున్నది.

-కరోనా వ్యాప్తి నివారణకు జిల్లా స్థాయిలో అన్ని చర్యలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ, దానికి అనుగుణంగా వ్యూహం ఖరారు చేసుకోవాలి. కరోనా విషయంలో పని చేస్తూనే, వర్షాకాలంలో వచ్చే అంటు వ్యాధుల నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.

- Advertisement -